Teachers | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): బడులకు గైర్హాజరవుతున్న టీచర్లను గాడినపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్ర్తాన్ని సంధిస్తున్నది. టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేయనున్నది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఈ హాజరువిధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఎఫ్ఆర్ఎస్ యాప్లో టీచర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇచ్చారు. జూన్ 12న రాష్ట్రంలోని బడులు పునఃప్రారంభంకానున్నాయి. ఈ లోపు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ను ముగించి రోజు నుంచే ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలుచేయనున్నది. స్మార్ట్ఫోన్, ట్యాబ్లలో యాప్ ను ఇన్స్టాల్ చేసి, కెమెరా ఆధారంగా స్కాన్ చేయగానే హాజరు నమోదు చేయడం దీని ప్రత్యేకత. గతంలో టీచర్లకు నిరుడు 19,200 ట్యాబ్లను పంపిణీ చేశారు. ఇటీవలే 4జీ జియో సిమ్కార్డులను కూడా అందజేశారు. ఆయా సిమ్కార్డులను ట్యాబ్లలో యాక్టివేట్ చేయాలని ఆదేశాలిచ్చారు.
ఒక విద్యార్థి ఒకట్రెండు రోజులు బడికి రాకపోతేనే ఎందుకురాలేదని అడిగే రోజులివి. కానీ ఇలా అడగాల్సిన కొంత మంది టీచర్లు ఇష్టానుసారంగా విధులకు డుమ్మా కొడుతున్నారు. నిరుడు జగిత్యాల జిల్లాలో ఓ టీచర్ ఏకంగా 20 ఏండ్ల పాటు విధులకు డుమ్మాకొట్టిన ఘటన వెలుగుచూసింది. ఇక 2021లో 153 మంది టీచర్లు ఏడాది నుంచి 8 ఏండ్లు పత్తాలేకుండా పోయినట్టు తెలిసింది. హైదరాబాద్లోని కొందరు టీచర్లు దుబాయ్, సౌదీ వంటి దేశాల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. ఇక మారుమూల ప్రాంతాల్లోని బడుల్లో ఇద్దరు టీచర్లు ఉంటే రోజుకు ఒకరు చొప్పున వంతులేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. తాజా హాజరు విధానంతో ఇలాంటి వాటికి చెక్పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. టీచర్ల హాజరు నమోదుకు ఇంత కాలం రిజిష్టర్లు వాడేవారు. కొందరు టీచర్లు విధులకు హాజరుకాకున్న తాపీగా మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టేవారు. కానిప్పుడు ఇలాంటివి ఈ విధానంతో కుదరడం కష్టమేనన్న స్పష్టంగా తెలుస్తున్నది.