హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గిరిజనులకు విద్య, ఉద్యోగావకాశాల్లో అమలవుతున్న రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ప్రభుత్వం తాజాగా వాటి అమలుకు రోస్టర్ పాయింట్లు ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం జీవో (నంబర్ 130) జారీ చేశారు. రిజర్వేషన్ పెంచేందుకు అవసరమైన సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మార్చేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసి కీలకమైన రోస్టర్ పాయింట్లను నిర్ణయించింది. రాష్ట్రంలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ ఉన్నప్పుడు రోస్టర్ పాయింట్లు 6. ఉదాహరణకు ఉద్యోగ నియామకాల్లో 100 పోస్టులు, విద్యాసంస్థల్లో 100 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటే ఇప్పటిదాకా రోస్టర్ పాయింట్లు.. 8, 25, 33, 58, 75, 83 ఉండేవి.
రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ రోస్టర్ పాయింట్లు ఖరారు చేయడంపై గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రిజర్వేషన్ల పెంపు విషయంలో మోదీ మోసం చేసినా కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నాయి. రిజర్వేషన్ల పెంపు సమయంలో తొండి మాటలు మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడేం మాట్లాడుతారని ప్రశ్నించాయి.