TS Minister Gangula | రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించు కున్న ఈరోజు రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రగతి భవన్ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యా బోధన తరగతులను వర్చువల్గా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు.
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ బీ గోపి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ సుంకే రవిశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ .. గతంలో వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు వెళ్లి చదివేవారన్నారు. ఇంతకుముందు తెలంగాణలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే, రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ప్రస్తుతం4490 సీట్లకు పెరిగాయని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దేశానికి వైద్యం అందించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి అన్నారు.
అంతకుముందు రేకుర్తి బ్రిడ్జి వద్ద మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో రేకుర్తి బ్రిడ్జి నుండి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు వేలాదిమంది వైద్య, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెడ్లు, ఆర్మీ, స్వయం సహాయక సంఘ బృందాలు పాల్గొన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బీ గోపి, కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, తదితరులు పాల్గొన్నారు