హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 1400 ఎకరాల్లో డ్రై పోర్టును ఏర్పాటుచేయాలని, ప్రతి జిల్లాకో లాజిస్టిక్ పార్కును ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సరుకు రవాణారంగాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన లాజిస్టిక్ పాలసీకి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతిభవన్లో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదంతెలిపింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని తీర్మానించింది. నూతన విధానం ద్వారా ప్రత్యక్షంగా లక్షమందికి, పరోక్షంగా రెండులక్షల మంది కి ఉపాధి దొరుకుతుందని, ఈ లక్ష్య సాధనకు రాష్ట్రానికి అవసరమయ్యే దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమలశాఖకు క్యాబినెట్ సూచించింది. దేశంలో తెలంగాణకు అనేక రకాల భౌగోళిక సానుకూలతలున్నాయి.
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు మధ్యనున్న రాష్ట్రం కావడంతో ఇక్కడి నుంచి దేశంలో ఏ రాష్ట్రానికైనా తేలికగా సరుకు రవాణాచేసేందుకు అవకాశాలున్నాయి. తెలంగాణలో వాయు, భూ, రైలు మార్గం ద్వారా మెరుగైన రవాణా సౌకర్యాలున్నాయి. ఇక్కడి నుంచి దాదాపు అన్నిదేశాలకు విమానయాన సౌకర్యం ఉన్నది. ముఖ్యమైన పట్టణాలకు దగ్గరగా ఉన్న నగరంగా హైదరాబాద్కు గుర్తింపు ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ లాజిస్టిక్స్ రంగానికి అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనేకమంది ముందుకొస్తున్నారు.
రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటుచేయడం వల్ల సముద్రమార్గం గుండా రవాణా చేసే ఉత్పత్తులకు పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు అనువుగా ఉంటుంది. డ్రైపోర్టు కారణంగా పోర్టుల్లో రోజులకొద్దీ వేచిచూడాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్లో వేలసంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో తయారయ్యే ఉత్పత్తులకు రవాణా సులువు కానున్నది. ఈ దిశగా తెలంగాణకు గల సానుకూలతలను గుర్తించిన పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ రవాణారంగానికి ప్రత్యేకపాలసీ తీసుకురావాలని గతంలో నిర్ణయించారు. దీనికి అనుగుణంగా అధికారులు పాలసీని రూపొందించారు.
పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవారంగంలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ లక్ష్యసాధనకు పరిశ్రమలశాఖ రూపొందించిన పాలసీకి ఆమోదముద్ర వేసింది. కరోనా నేపథ్యంలో బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తుసేవలు అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్ రంగం ఎంతగానో ఉపయోపడిందని క్యాబినెట్ గుర్తించింది. అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలు లాజిస్టిక్స్ రంగాన్ని వినియోగించుకొని ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక , వ్యవసాయ అభివృద్ధిలో ఆయా ఉత్పత్తులను దేశవిదేశీ వినియోగదారుల చెంతకు చేర్చడానికి లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని క్యాబినెట్ అభిప్రాయపడింది. వ్యవసాయరంగంలో సాధించిన అభివృద్ధి, తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అదనపు వాణిజ్యానికి లాజిస్టిక్ రంగాభివృద్ధి ఎంతో అవసరమని గుర్తించింది. రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్స్టోరేజీలు, డ్రైపోర్టు, ట్రాక్డాక్ పార్కింగ్ తదితర లాజిస్టిక్స్ సంబంధ మౌలిక వసతులను మెరుగుపర్చాలని క్యాబినెట్ నిర్ణయించింది.