హైదరాబాద్ , నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో న్యాయస్థాన సముదాయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు నివాస సముదాయాలనూ అ త్యాధునిక వసతులతో నిర్మించనున్నట్టు తెలిపారు. రాబోయే రెండేండ్లలో న్యాయశాఖకు రూ.2వేల కోట్ల కేటాయిస్తామని చెప్పారు. అన్ని న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, లా సెక్రటరీ నర్సింగ్రావు తదితరులు కూడా ఈ భేటీలో ఉన్నారు. ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదిగిందని.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సత్వర న్యాయాన్ని అందించే విషయంలోనూ తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలువాలని ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా హైకోర్టు చీఫ్ జస్టిస్ చర్యలు చేపట్టాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయసహకారాలన్నీ అందిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఎనిమిదేండ్లలో 4,963 పోస్టుల భర్తీ
పోరాడి సాధించుకున్న రాష్ట్రం.. 8 ఏండ్లలోనే దేశంలోని పెద్ద పెద్ద రాష్ర్టాలను కూడా అభివృద్ధిలో దాటేసి ముందుకెళ్లిందని సీఎం కేసీఆర్ వివరించారు. తమ ప్రభుత్వం మానవీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గడిచిన 8 ఏండ్లలో అనేక చర్యలు చేపట్టామని అన్నారు. ఎనిమిదేండ్లలో న్యాయస్థానాల పరిధిలో 4,963 పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు. మరికొన్ని పోస్టులు కావాలని హైకోర్టు నుంచి తనకు ఇటీవల సమాచారం వచ్చిందని, మిగిలిన పోస్టుల భర్తీకి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అనుమతులు మంజూరు చేస్తామని సీజేకి కేసీఆర్ హామీ ఇచ్చారు.
న్యాయస్థానాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు, కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి అవసరమైన నిధులు ఇస్తామన్నారు. రాష్ర్టంలో 23 జిల్లాల్లో కొత్తగా న్యాయస్థానాల భవన సముదాయాలు నిర్మించాల్సి ఉన్నదని సీజే ఈ సందర్భంగా గుర్తుచేయగా.. ప్రాధాన్యతాక్రమంలో ఎక్కడ మొదట భవనాలు కావాలో చెప్తే తక్షణమే నిధులు మంజూరు చేస్తామని, ఒక్కొక్కదానికి 80 కోట్లను కేటాయిస్తామని సీఎం స్పష్టంచేశారు. బడ్జెట్లో న్యాయ విభాగానికి ఈ ఏడాది వెయ్యికోట్ల రూపాయలను కేటాయించామని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యికోట్లు కేటాయిస్తామని చెప్పారు. న్యాయస్థానాలతోపాటు న్యాయమూర్తులు, కక్షిదారులు, న్యాయవాదులకు కూడా ఈ నిధులతో ఉపయోగపడేలా చూడాలన్నదే తమ ధ్యేయమన్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ పాతది అయ్యిందని.. కొత్త భవనం నిర్మాణానికి చంచల్గూడలోని తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఉన్న 14ఎకరాల భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. అక్కడ నిర్మాణ పనులనూ వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ భవనాన్ని కూడా సద్వినియోగం చేస్తామని, ఇక్కడికి ట్రాన్స్కో కార్యాలయాలను తరలిస్తామన్నారు.
42 మంది న్యాయమూర్తులకు గృహ సముదాయం
రాష్ర్ట హైకోర్టులోని 42 మంది న్యాయమూర్తులు అందరికీ సకల వసతులతో గృహసముదాయాన్ని నిర్మిస్తామని, ఇవి శాశ్వతంగా ఉంటాయని సీఎం ప్రకటించారు. న్యాయమూర్తులు అద్దె ఇండ్లలోనో.. చాలీచాలని ఇండ్లలోనో ఉండాల్సిన బాధ లేకుండా చూసే బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదని చెప్పారు. దుర్గం చెరువు లేదా పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎంతుందో చూడాలని సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో చెప్పారు. గృహ సముదాయం నిర్మించేవరకు న్యాయమూర్తులు ఉండేందుకు ఇస్తున్న అద్దెభత్యాన్ని పెంచాలని కూడా సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.