హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): గిరిజన యూనివర్సిటీపై తెలంగాణ నుంచి తమకు ప్రతిపాదన రాలేదని పార్లమెంట్ను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు, వివక్షతో వ్యవహరిస్తుందనడానికి ఇదే నిదర్శమని పేర్కొన్నారు. మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, అత్రం సక్కుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం ములుగు జిల్లా బండారుపల్లి, గట్టుమైసమ్మ దేవాలయం వద్ద భూములను కేంద్ర బృందం గుర్తించిందని, చివరకు గట్టుమైసమ్మ వద్ద భూమిని దాదాపు ఖరారు చేసిందని చెప్పారు. 335 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం ద్వారా హెచ్ఆర్డీకి అందించామని పేర్కొన్నారు. అయినా గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపాదనలు రాలేదనడం కేంద్రం నిర్లక్ష్యానికి తార్కాణమని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఏపీ, తెలంగాణకు ఒక్కో గిరిజన యూనివర్సిటీని కేంద్రం ఇచ్చిందని, ఏపీలో యూనివర్సిటీ తాత్కాలిక భవనాల్లో నడుస్తుంటే, తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు మోక్షం లేదని తెలిపారు.
నాడు రిజర్వేషన్లు.. నేడు యూనివర్సిటీ
గిరిజనుల రిజర్వేషన్ పెంపు బిల్లును గతంలో తెలంగాణ పంపించినా రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని పార్లమెంట్లో అన్నారని, ఇపుడు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ఇదే రకమైన సమాధానాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చారని మంత్రి వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ అనేకమార్లు ప్రధానికి వినతిపత్రం అందించారని గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్లో గిరిజనులకు రూ.13,412 కోట్లు కేటాయిస్తే, తెలంగాణ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించడం సీఎం కేసీఆర్కు గిరిజనులపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదని చెప్పారు.
ఆ నలుగురు కూడా మిగలరు
రేవంత్రెడ్డి పాదయాత్ర ముగిసే నాటికి ఆయన వెంట నడిచే నలుగురు నాయకులు కూడా మిగలరని సత్యవతి రాథోడ్ అన్నారు. మేడారం జాతర, ములుగు జిల్లా గురించి మాట్లాడే అర్హత రేవంత్కి లేదన్నారు. ఈ నెలలోనే పోడు భూముల పట్టాలు ఇస్తామని మంత్రి ప్రకటించారు.