ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో ధర్మపరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నందిపేట్ మండలం పలుగుట్ట కేదారేశ్వరాశ్రమంలో వైభవోపేతంగా నిర్వహిస్తున్న సాధూ పరిషత్ 57వ మహాసభల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసే కార్యాక్రమాలు చేపట్టారన్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా రూ. 2వేల కోట్లతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి ఆలయం ప్రపంచ స్థాయి టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయింపులు చేయడమే కాక ధూపదీప నైవేద్యాలు, దేవాలయాల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్ అని ఆయన తేల్చిచెప్పారు.
ఆర్మూర్ గొప్ప దైవచింతన కలిగిన నేల అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పరమశివుడి దివ్యక్షేత్రంగా సిద్ధులగుట్ట భక్తకోటిని పరవశింపజేస్తోంది. పురాతన కాలంలో 9 మంది సిద్ధులు తపస్సు చేసిన ఫలితంగా ఈ పుణ్యక్షేత్రం నవనాధ సిద్ధులగుట్టగా ప్రసిద్ధి చెందింది. పరమశివుడి దివ్యఆలయంతో పాటు శివలింగం కలిగిన గుహ ఉండడం సిద్ధులగుట్ట ప్రత్యేకత. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించి ఇప్పటికే రూ. 20 కోట్లతో ఘాట్ రోడ్డు వేయించాం. సిద్ధులగుట్టపై మరెన్నో నిర్మాణాలు చేపట్టాం అని ఎమ్మెల్యే తెలిపారు. మహాపీఠాధిపతులు, సాధువులు ఈ మహాసభలు ముగిసిన తరువాత సిద్ధులగుట్ట శివయ్యను తప్పకుండా దర్శించుకోవాలని అభ్యర్థిస్తున్నానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు.