హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒకరికీ కంటి పరీక్షలు నిర్వహించడం, మందులు, కండ్లద్దాలు అందించడంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్వో, డీఎంహెచ్వోలతో మంత్రి హరీశ్రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. సబ్సెంటర్, పీహెచ్సీలవారీగా గత నెలలో సాధించిన పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రాథమిక వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయడంలో భాగంగా సబ్ సెంటర్లు, పీహెచ్సీలకు మరమ్మతులు, నిర్మాణాలతోపాటు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 929 మంది వైద్యులను ఇటీవల నియమించామని గుర్తు చేశారు. ‘దవాఖానకు వచ్చేవారిని మన కుటుంబ సభ్యులుగా భావించి వైద్యసేవలు అందిద్దాం. ఒకరు చేసిన తప్పు వల్ల అందరం బాధపడాల్సిన పరిస్థితి రావొద్దు. పేరు పేరునా ప్రార్థిస్తున్నా బాధ్యతతో పేద ప్రజలకు సేవ చేద్దా’మని ఉద్బోధించారు. కంటి వెలుగు అమలవుతున్న సమయంలో రోజువారీ వైద్యసేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 86% డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లో..
డిసెంబర్ నెలలో ప్రభుత్వ దవాఖానల డెలివరీల్లో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని హరీశ్రావు తెలిపారు. 86 శాతం డెలివరీలు చేసి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సబ్ సెంటర్ల వారీగా చూస్తే జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో ఎకువగా ప్రైవేట్ డెలివరీలు అవుతున్నాయని, అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. గత మూడు నెలల ఓపీని పరిశీలిస్తే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో రాష్ట్ర సగటు కన్నా తక్కువ ఓపీ నమోదైందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుటుంబ, ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కంటివెలుగు అద్దాలు మేడిన్ తెలంగాణ సంగారెడ్డిలో మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి, జనవరి 6(నమస్తే తెలంగాణ): కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయనున్న కండ్లద్దాలను తెలంగాణలోనే తయారుచేస్తున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. కండ్లద్దాలను గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కులో ఏర్పాటైన ఆకృతి కంపెనీ ఈసారి కండ్లద్దాలను సిద్ధం చేస్తున్నదని వివరించారు.
శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన కంటివెలుగు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తలపెట్టిన కంటివెలుగు ప్రపంచంలోనే అతిపెద్దదని, ఇది గిన్నిస్ బుక్లోకి ఎక్కడం ఖాయమని చెప్పారు. గతంలో కంటి వెలుగు ద్వారా 50 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశామని, ఈసారి 60 లక్షల మందికి పంపిణీ చేయాలన్నది లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.