హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది. ఈ ప్రక్రియ మొత్తం 37 రోజుల్లో ముగియనుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు.
టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ఈనెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల సమక్షంలో మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి సమగ్రంగా చర్చించిన విషయం తెలిసిందే. చర్చలు ఫలప్రదం కాగా, తాజాగా సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ఆమోదం మేరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై సాధారణ పరిపాలన శాఖ గతంలో నిషేధం విధించింది. ఈ మేరకు జీవో-91ను జారీచేయగా, ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ గురువారం రాత్రి జీఏడీ జీవోను విడుదల చేసింది.