వరంగల్ : తెలంగాణ రైతాంగం సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తూ ముందడుగు వేస్తుండడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం రాగన్న గూడెంలో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తూ వాటి ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతులను అభినందించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో తెలంగాణ పల్లెలు పచ్చగా మారాయని, రైతులు పసిడి పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ విధానం ద్వారా రైతులు స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. అంతకు ముందు భారత తొలిఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా సర్దార్కు మంత్రి నివాళులు అర్పించారు.
భారత దేశ సమగ్రత కోసం పటేల్ చేసిన కృషిని గుర్తు చేశారు. ఉక్కు మనిషి పటేల్ స్ఫూర్తితో భారత సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో భారత్ రాష్ట్ర సమితి విజయం కోసం కంకణ బద్దులం కావాలని ఆకాంక్షించారు.