Telangana | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మృతిచెందాడు. వాటర్ జెట్స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ (27) ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో చదువు పూర్తయ్యి ఇండియాకు తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న సమయంలో కుమారుడి మరణవార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లే.. కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ.. ఇండియానా పోలీస్లోని పర్డ్యూ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్లో మాస్టర్ డిగ్రీ చేస్తున్నాడు. మార్చి 9వ తేదీన విస్టీరియా ద్వీపంలో వెకేషన్కు వెళ్లాడు. అక్కడ ప్యూరీ ప్లేగ్రౌండ్స్ వద్ద యమహా పర్సనల్ వాటర్క్రాఫ్ట్ ( జెట్స్కీ)ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడి ఫ్లోటింగ్ ప్లేగ్రౌండ్లో దాని నడుపుతుండగా.. మరో జెట్స్కీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, రెండో జెట్స్కీ నడుపుతున్నది 14 ఏండ్ల బాలుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. వెంకటరమణ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.