హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.73,767 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.53,109 కోట్లు రాగా ఈసారి మరో రూ.20వేల కోట్లు పెరిగింది. అంటే 39% వృద్ధిరేటు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు ప్రతి నెలా సగటున రూ.9వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఏప్రిల్ నుంచి ప్రతినెలా ఆదాయం పెరుగుతూనే ఉన్నది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరుసగా రూ.10వేల కోట్ల మార్క్ దాటింది.
సెప్టెంబర్లో రూ.10,153 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది నిరుడు సెప్టెంబర్లో వచ్చిన రూ.8,268 కంటే 23% అధికం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రతి నెలా రెవెన్యూ రాబడి పెరుగుతూనే ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల (జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజులు, సేల్స్ట్యాక్స్, ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నులు) ద్వారా రూ.1.93 లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నది రాష్ట్ర బడ్జెట్ అంచనా. సాధారణంగా చివరి రెండు, మూడు నెలల్లో అత్యధికంగా ఆదాయం వస్తుంది. తొలి ఆరు నెలల్లోనే రాష్ర్టానికి రూ.73,767 కోట్ల ఆదాయం రావడం ఆశాజనక పరిణామం.