హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీకేజీ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్కి తాను ఉద్యోగం ఇప్పించానని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను 2021లో టీఎస్టీఎస్ చైర్మన్ అయ్యానని, 2017లో నెట్వర్క్ ఎక్స్పర్ట్గా టీఎస్పీఎస్సీలో నేరుగా జాయిన అయిన రాజశేఖర్ 2023 వరకు ఆదే పొజిషన్లో ఉన్నాడని ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్తో అరోపణలు చేయడం తగదని రేవంత్రెడ్డిని హెచ్చరించారు.
ప్రభుత్వం మీద, ప్రభుత్వ సంస్థల పనితీరు మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఇటువంటి బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేస్తూ యువతను గందరగోళ పరుస్తున్నారని మండిపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అని, అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదని స్పష్టంచేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర కన్నా రేవంత్రెడ్డి పాదయాత్ర హైలెట్ కావడానికే అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీపై మంత్రి కేటీఆర్ ఇప్పటికే వివరణ ఇచ్చారని, కేటీఆర్ ప్రతిష్ఠను తగ్గించడానికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, సిట్ పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు.