CM KCR |రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాక యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారం, గైడెన్స్ అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతోపాటు దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రకటించే ఖాళీల భర్తీ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు సమీకరించి అందుకనుగుణంగా శిక్షణ అందించాలని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో నాలుగు.. మొత్తం 33 జిల్లాలో 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు.
పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియేట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యాబోధన, పోటీ పరీక్షలకు శిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుదల, ఇంటర్మీడియట్ కళాశాలలుగా గురుకుల పాఠశాలల ఉన్నతీకరణ, బడుగు బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎస్.మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, రోహిత్ రెడ్డి, విద్యాసాగర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఒ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ్ రావు, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, సీఎంవో సెక్రటరీ రాహూల్ బొజ్జా, సీఎం ఓఎస్డీ వర్గీస్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రోనాల్డ్ రోస్, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, అల్ప సంఖ్యాక వర్గాల గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బీ షఫియుల్లా, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ, బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో విజయావకాశాలను సాధించిపెట్టే అస్త్రాలుగా రాష్ట్ర ప్రభుత్వ స్టడీ సర్కిళ్లు రూపాంతరం చెందాలి. శిక్షణనిచ్చే క్యాంపస్ రిక్రూట్ మెంట్ కేంద్రాలుగా మారాలి. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి. ఇందుకు సమర్థులైన అధికారులను నియమించాలి. ఐటిఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి` అని కేసీఆర్ అన్నారు.
అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఐఏఎస్ / ఐపీఎస్ / ఐఎఫ్ఎస్, గ్రూప్ 1, కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. `కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి కల్పించే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టడీ సర్కిల్ లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. బాలుర మాదిరే బాలికలకు కూడా స్టడీ సర్కిళ్లల్లో ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించాలి’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియేట్ కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. బాలికలకు ప్రత్యేకంగా విద్యను అందిస్తున్న కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లోనూ ఇంటర్మీడియేట్ విద్యను
ప్రవేశ పెట్టాలని సీఎం అన్నారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలన్నారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది? వారు పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని సీఎం అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17 కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులను రూపొందించాలని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించాలన్నారు.
ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు.