హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పూర్తి ఆధునికీకరణ దిశగా అడుగులేస్తున్నది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టడంతోపాటు వీలున్న ప్రతిచోట డిజిటలైజేషన్ను ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నది. ఇందుకు తగ్గట్టు ఇప్పటికే సంస్థ ప్రాథమిక ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారులు చెప్తున్నారు. డీజిల్ బస్సుల స్థానంలో 2025 వరకు దశలవారీగా 3,360 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించనున్నది.
వీటితో సంస్థకు ఇంధన ఖర్చు కలిసి రావడంతోపాటు పర్యావరణహితంగా ఉంటుందని సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు రూ.16 కోట్లతో 25 డీజిల్ బస్సులను ప్రయోగాత్మకంగా గిగాహెడ్జ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. టికెట్లు, బస్ పాసులు, ఇతర పేమెంట్ల విషయంలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనున్నది. సంస్థ హెడ్ ఆఫీసులో అమల్లో ఉన్న ఈ-ఆఫీసు అప్లికేషన్ను త్వరలో అన్ని జిల్లా యూనిట్లలోనూ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. బస్ స్టేషన్లు, ఆర్టీసీకి చెందిన పెట్రోల్ బంకుల్లోనూ డిజిటల్ పద్ధతిలో పేమెంట్లు స్వీకరించేందుకుగాను త్వరలో టీఎస్ఆర్టీసీ కమర్షియల్ యాప్ను తీసుకురానున్నది.
ఆర్టీసీ ఇప్పటికే కొనుగోలు చేసిన కొత్త సూపర్ లగ్జరీ బస్సులతో రాబోయే రోజుల్లో సంస్థ సగటు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రూ. 200 కోట్లకుపైగా వెచ్చించి ఆర్టీసీ కొత్తగా 600 సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేస్తున్నది. ఇందులో 58 బస్సులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. మరో మూడు నెలల్లో మొత్తం ఆరు వందల కొత్త సూపర్ లగ్జరీ బస్సులు సంస్థ చేతికి వస్తే.. 69 శాతం ఉన్న ఓఆర్ సగటు మరో 3 శాతం పెరుగడం ఖాయమని చెప్తున్నారు. ఈ బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీ బ్యాంకుల నుంచి రుణాలు కూడా సేకరించింది.
రెండేండ్లతో పోలిస్తే 2022లో ఆర్టీసీ ట్రాఫిక్ రెవెన్యూలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2021తో పోలిస్తే 45 శాతం వృద్ధి నమోదు చేసుకొని ఏకంగా రూ. 4,641 కోట్లకు చేరింది. దీంతో సంస్థ నష్టాలు గణనీయంగా తగ్గాయి. 2021లో రూ. 1,610 కోట్లుగా ఉన్న నష్టాలు 2022లో డీజిల్ రేట్లు పెరిగినప్పటికీ రూ. 421 కోట్లకు తగ్గడం విశేషం. త్వరలో రాబోయే కొత్త బస్సులతో నిర్వహణ సామర్థ్యం పెరిగి నిర్వహణ వ్యయం తగ్గుతుందని, 2023లో నష్టాలు మరింత తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రయాణికులను ఆకట్టుకోవడం వల్లే ట్రాఫిక్ రెవెన్యూలో గణనీయ వృద్ధి నమోదైందని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.