హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): దేశం గర్వపడేలా అనాథలకు శాశ్వతంగా అండగా ఉండే అత్యున్నత విధానాన్ని రూపొదించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. మంత్రి సత్యవతి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలులో సమావేశమైంది. మంత్రి కేటీఆర్, ఉపసంఘం సభ్యులైన మంత్రులు జగదీశ్రెడ్డి, పువ్వాడ, అల్లోల, ఎర్రబెల్లి, కొప్పుల, శ్రీనివాస్గౌడ్, సబిత, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అనాథల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్న విధానం, యునిసెఫ్ మార్గదర్శకాలపై చర్చించాలని సూచించారు. హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని ఎస్వోఎస్ సంస్థ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు సబ్కమిటీ బృందం పర్యటించాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాల్లో అధికారులు, సభ్యులు పర్యటించి 10 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు.