మహబూబ్నగర్ : ఆడపిల్లల పట్ల సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళా సాధికారత, గృహ హింస, మహిళా ఉద్యోగినులు పని చేసే చోట లైంగిక వేధింపులు అనే అంశంపై నిర్వహించిన సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సమాజంలో ఆడ, మగ ఇద్దరిని సమానంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళా కమిషన్ ద్వారా మహిళలకు రక్షణ, హక్కులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్) ప్రకారం ప్రతి శాఖలో ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించాలని, పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని తెలిపారు. అలాగే పెళ్లయిన ఆడ పిల్లల పట్ల అత్తమామల్లో కూడా మార్పు రావాలన్నారు. కోడళ్లు కూడా అత్తా మామలను తల్లి దండ్రుల్లా భావించాలన్నారు.
బాల్యవివాహాలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి పెళ్లిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మహిళలకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం షీ టీమ్లను ఏర్పాటు చేసిందని, అంతేకాక భరోసా కేంద్రాలను నెలకొల్పిందని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.