హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతాదినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామ క్రమం 2022 సెప్టెంబర్ 17 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏడాదిపాటు ‘తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం 3 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నది. ప్రారంభ వేడుకలను ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ముగింపు వేడుకలను 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీలలో మూడురోజులపాటు నిర్వహిస్తారు. వజ్రోత్సవాలతోపాటుగా మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. గిరిజనుల పోడు భూముల సమస్య పరిషారానికి ప్రతి జిల్లాలో రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది.