రవీంద్రభారతి, మార్చి 22: రాష్ట్రంలో 55 శాతం ఉన్న బీసీలకు తాజా వార్షిక బడ్జెట్లో మరోసారి సీఎం రేవంత్రెడ్డి నయవంచనతో మొండిచెయ్యి చూపారని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు ఏ మూలకు సరిపోవని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి, మూడేండ్లుగా దగా చేస్తున్నదని మండిపడ్డారు. గత మూడు బడ్జెట్లలో రూ.60 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, రూ.31,005 కోట్లు కేటాయించిందని, దానిలో కేవలం రూ.5,568 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. బడ్జెట్పై బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఈ బడ్జెట్ బీసీలకు ఘనమైనదని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు రూ.44, 975.61 కోట్లు కేటాయించిందని, అందులో 26,444.74 కోట్లు అంటే 59.24 శాతం ఖర్చు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలకు విడనాడి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ఏటా 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీలు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంటలెక్చుల్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్రాజ్గౌడ్, కన్వీనర్లు అంబాల నారాయణగౌడ్, అయిలి వెంకన్నగౌడ్, యెలికట్టె విజయ్కుమార్గౌడ్, దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.