హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బాలురతో పొల్చితే బాలికలకు అత్యధికంగా టాయిలెట్లు గల రాష్ర్టాల్లో తెలంగాణ, కేరళ నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలురకు సగటున 1 టాయిలెట్ ఉంటే.. బాలికలకు సగటున 1.47 టాయిలెట్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బాల, బాలికల టాయిలెట్ల నిష్పత్తిపై రాజ్యసభలో ఎంపీ అబ్దుల్ వాహబ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ బుధవారం సమాధానమిచ్చారు. 2021-22 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్(యూడైస్) నివేదిక ఆధారంగా గణాంకాలను రాజ్యసభలో వెల్లడించారు.
జాతీయ స్థాయిలో బాలికలకు సగటున 1.09 టాయిలెట్లు ఉండగా, తెలంగాణలో అంత కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇటీవల తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున టాయిలెట్లను నిర్మించారు. తాజాగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో టాయిలెట్ల నిర్మాణం, ఆధునికీకరణ, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. దీంతోనే టాయిలెట్ల నిష్పత్తిలో తెలంగాణ అగ్రభాగంలో ఉన్నదని అధికారులు చెప్తున్నారు. పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్ల నిర్మాణం విషయంలో బీజేపీ రాష్ర్టాలు వెనుకబడి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.