హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : వ్యక్తికి ఆధార్, ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ఎలాగో.. పదోతరగతి విద్యార్థులందరికీ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)ను విద్యాశాఖ అమలుచేయనున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి మొదటిసారిగా పదోతరగతి మెమోలు, టీసీలపై ఈ నంబర్ను ముద్రిస్తారు. 11 అంకెల యూనిక్ ఐడీ (పెన్ నంబర్)ని పదోతరగతి విద్యార్థుల సర్టిఫికెట్లపై ముద్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. యూడైస్ ప్లస్ పోర్టల్ ద్వారా జనరేట్ అయిన ఈ నంబర్ను మెమోలపై ముద్రిస్తారు. పదోతరగతి వార్షిక పరీక్షలు పూర్తికాగా, ఈ నెల 13న మూల్యాంకనం ముగిసింది. ప్రస్తుతానికి మార్కుల క్రోడీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే వారం రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తారు. ఇప్పటివరకు పదోతరగతి మెమోలపై హాల్టికెట్ నంబర్ను మాత్రమే ముద్రిస్తున్నారు. పలు రకాల అంతర్గత సెక్యూరిటీ ఫీచర్లను చేర్చారు. ఇదివరకు సర్టిఫికెట్లు అసలువో.. నకిలీవో తెలుసుకోవాలంటే అధికారులు లోతైన పరిశీలన తర్వాతే తెలిసేది. కానిప్పుడు ‘పెన్’ నంబర్ ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు.
లాభాలివే..
నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ డిజిలాకర్, అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ (ఏబీసీ)లను అమల్లోకి తీసుకొచ్చింది. ‘వన్ స్టూడెంట్ వన్ ఐడీ’ పేరిట విద్యార్థులకు అటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీని జారీచేస్తుంది. ఈ బాధ్యతలను సమగ్రశిక్ష ప్రాజెక్ట్ (ఎస్ఎస్ఏ) పర్యవేక్షిస్తుంది. అపార్ ఐడీ జారీచేయాలంటే ముందుగా విద్యార్థికి పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ను (పెన్) జారీచేస్తారు. అపార్ ఐడీకి తల్లిదండ్రుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ పెన్ నెంబర్ జారీకి తల్లిదండ్రుల నుంచి అనుమతి అవసరం లేదు. ఈ నేపథ్యంలో అపార్తో నిమిత్తం లేకుండా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ( యూ డైస్)లో నమోదైన విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ పెన్ నంబర్ను అమలుచేస్తుంది. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు గల విద్యార్థులందరికి ఈ నంబర్ను జారీచేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థి ప్రయాణం, ప్రగతి మొత్తం ఆన్లైన్లో నమోదవుతుంది. ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు.. ఒక విద్యాసంస్థ నుంచి మరో విద్యాసంస్థకు మారిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదవుతుంటాయి. ఆన్లైన్లో నంబర్ను ఎంటర్చేయగానే విద్యార్థి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. దేశంలో మొదటిసారిగా బోగస్ విద్యార్థులను నివారించేందుకు తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి నామినల్స్రోల్స్ను యూ డైస్తో అనుసంధానించారు. యూ డైస్లో పేర్లున్న వారిచేతనే పరీక్ష ఫీజునను కట్టించారు. తాజాగా పదో తరగతి మోమోలు, టీసీలపై పెన్ నెంబర్ను ముద్రిస్తున్నారు.