నాగర్కర్నూలు : శివనామ స్మరణతో శ్రీశైలం క్షేత్రానికి వెళ్లిన తెలంగాణ శివస్వాములను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలోని కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన 50 మంది శివస్వాములు నిన్న సాయంత్రం రోడ్డుమార్గంలో వెళితే దూరమవుతుందని రెండు ఇంజిన్ బోట్లో కృష్ణా నది గుండా శ్రీశైలం ఆలయానికి బయలు దేరారు.
అయితే పెంట్లవెల్లి మండల పరిధి మల్లేశ్వరం గ్రామ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పోలీసులు వీరు ప్రయాణిస్తున్న రెండ్లు బోట్లను ఆపివేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి వీరిని మల్లేశ్వరం ఒడ్డునే ఉంచడంతో బుధవారం వరకు శివస్వాములు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల తెలంగాణ, ఏపీ మత్స్యకారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో బోట్లో ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు.
కాగా విషయం తెలిసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కర్నూలు ఎస్పీతో ఫొన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో శివ స్వాములు సురక్షితంగా శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు.