హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి, సత్తా చా టారు. జాతీయంగా 20 మంది విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్ను సాధించగా, వారిలో ముగ్గురు మన విద్యార్థులున్నారు. రాష్ర్టానికి చెందిన బిక్కన అభినవ్ చౌదరి, గుత్తికొండ అభిరామ్, వావిలాల చిద్విలాస్రెడ్డి వందకు వంద ఎన్టీఏ స్కోర్ చేశారు.
జేఈఈ మెయిన్ -1 ఫలితాలు మంగళవారం విడుదల కాగా, 20 మందిలో అంతా బాలురే ఉండగా, బాలికలు ఒక్కరూ లేరు. వీరిలో 14 మంది జనర ల్ క్యాటగిరీ, నలుగురు ఓబీసీ, ఒకరు ఎస్సీ, ఒకరు ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి చెందిన వా రు. దివ్యాంగుల్లో టాపర్గా నిలిచిన మహ్మద్ సాహిల్ అక్తర్కు 99.98 పర్సంటైల్ వచ్చింది. ఎస్సీ టాపర్గా నిలిచిన దేశాంక్ ప్రతాప్ సింగ్ 100, ఎస్టీ టాపర్గా నిలిచిన ధీరావత్ తనుజ్ 99.99 పర్సంటైల్ సాధించారు.ఈ ఏడాది జేఈఈ మెయిన్-1కు 8,60,064 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 8,23,967 మంది విద్యార్థులు 95.80 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
వెబ్సైట్లో ఫలితాలు..
జేఈఈ మెయిన్1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. జేఈఈ మెయిన్1 గత జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించారు. పేపర్-1కు 8.20 లక్షల మందికిపైగా విద్యార్థులు, పేపర్-2కు 46 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్1 తుది ‘కీ’ని సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
రెండో విడత రిజిస్ట్రేషన్ షురూ
మంగళవారం నుంచి జేఈఈ మెయిన్ -2 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. దరఖాస్తుకు మార్చి 7 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉండగా, రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించొచ్చు. పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. మొదటి విడత పరీక్షలు రాసిన విద్యార్థులు రెండో విడతకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండు కలిపి ర్యాంకుల వెల్లడి
ప్రస్తుతం తొలి, రెండో విడత ఫలితాలు విడుదలైన తర్వాత ఆల్ ఇండియా ర్యాంకులను ఎన్టీఏ ప్రకటిస్తుంది. వీరిలో టాప్ 2 లక్షలకు పైగా విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తుంది. ర్యాంకులను బట్టి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సామాన్యుల కోసం సాంకేతికను అభివృద్ధి చేస్తా
మా స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట. మా అమ్మానాన్న టీచర్లే. హైదరాబాద్లోని హస్తినాపురంలో స్థిరపడ్డాం. అన్న రుషికేశ్ బిట్స్ పిలానిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. అన్న గైడెన్స్.. లెక్చరర్ల ప్రోత్సాహం లభించింది. సెల్ఫోన్లో టైం వేస్ట్ చేయకుండా, క్రికెట్మ్యాచులు పెద్దగా చూకుండా నిబద్ధతతో మెయిన్స్కు ప్రిపేరయ్యాను. దీంతోనే వంద పర్సంటైల్ సాధించా. ఐఐటీలో ముంబైలో సీఎస్ఈలో చేరి సాఫ్ట్వేర్ ఇంజినీర్నవుతా. మల్టీనేషనల్ కంపెనీలోనే చేరి సామాన్యుల అవసరాలు తీర్చే సాంకేతికతను అభివృద్ధి చేస్తా.
– వావిలాల చిద్విలాస్రెడ్డి
ఏరోస్పేస్లో రాణిస్తా
చదువుల్లో మొదటి నుంచి చురుగ్గా ఉండేవాడిని. టీచర్లు, లెక్చరర్ల సహకారంతో జేఈఈ రాశా. మొదటి ప్రయత్నంలోనే వంద పర్సంటైల్ రావడం సంతోషం. మా కుటుంబం కూకట్పల్లిలో ఉంటుంది. అమ్మ ప్రభుత్వ టీచర్గా, నాన్న వ్యాపారం చేస్తుంటారు. ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా జేఈఈ అడ్వాన్స్డ్పైనే. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించి బాంబే ఐఐటీలో చేరుతా. ఏరోస్పేస్లో రాణించాలని అనుకుంటున్నా. రాకెట్స్ రిసెర్చ్ రంగంపై దృష్టి సారించాలనుకుంటున్నా. – గుత్తికొండ అభిరామ్
ఐఐటీ బాంబేలో చేరతా
నాన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్, అమ్మ అకౌంట్స్ ఉద్యోగం చేస్తున్నారు. మా కుటుంబం హైదరాబాద్లోని మదీనగూడలో ఉంటున్నది. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరుతా. కంప్యూటర్ సైన్స్లో చేరి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నా. అమ్మానాన్న, లెక్చరర్లు ఎంతగానో సహకరించారు. నిరుత్సాహానికి గురికాకుండా పరీక్షలకు సన్నద్ధమయ్యా. తప్పులను సవరించుకుంటూ.. అవగాహన పెంచుకుంటూ ముందుకెళ్లా. ఇదే నా సక్సెస్కు కారణం.
– బిక్కన అభినవ్