హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. యూరియా కొరత నేపథ్యంలో నానో యూరియా వినియోగం పెంచాలని కోరారు. వానకాలం ఎరువులకు సంబంధించి సోమవారం ఎరువుల కంపెనీలు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వానకాలానికి యూరియా కొరత తప్పదనే సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్తోపాటు సుమారు 10 వేల టన్నుల డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఖరీఫ్ 2026 సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం 11.5 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరిందని, కేంద్రం 10 లక్షల టన్నులు మాత్రమే కేటాయించిందని అన్నారు.
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకు 2 లక్షల టన్నులు, జూలై, ఆగస్టు నెలల్లో నెలకు 1.5 లక్షల టన్నులు, సెప్టెంబర్లో లక్ష టన్నుల చొప్పున సరఫరా ఉంటుందని తెలిపారు. జూన్ మొదటివారంలో రాష్ట్రంలో వరి నాట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, మే నెలాఖరునాటికి కనీసం 3.5 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 90 శాతం తెలంగాణ అవసరాలకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర యూరియా యాప్ను మార్గదర్శకంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎరువులను అందించేందుకు సరికొత్త యాప్ను తీసుకువస్తున్నదని మంత్రి చెప్పారు. మే 21 నుంచి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ యాప్ను ్రప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.