వ్యవసాయ యూనివర్సిటీ, మే 24: భవిష్యత్తులో విదేశాలకు సిరులు పండే విత్తనాలు ఇచ్చే సత్తా తెలంగాణకే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రాజేంద్రనగర్లోని జ యశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటుచేసిన విత్తన మేళాను ప్రారంభించి, మాట్లాడారు. తెలంగాణ నేలలు, వాతావరణ పరిస్థితులు విత్తనోత్పత్తికి చాలా అనుకూలమని చెప్పారు. తెలంగాణలో తయారయ్యే విత్తనాలకు ఇతర ప్రాంతాల్లో డిమాండ్ ఉన్నదని, విత్తనోత్పత్తిపై రైతులు దృష్టిసారించాలని సూచించారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి, భూ సారాన్ని పరిరక్షించుకుంటూ అధిక ఉత్పత్తి, ఉత్పాదకత సాధించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పా టుకు చర్యలు చేపట్టిందని అన్నారు.
మేళాలో 45 రకాల విత్తనాలు
మేళాలో వ్యవసాయ వర్సిటీతోపాటు ఐకా ర్, పలు జాతీయ, రాష్ట్రస్థాయి సంస్థలు, వ్యవసాయ అనుబంధ వర్సిటీలు స్టాళ్లు ఏర్పాటుచేశాయి. ప్రధాన పది పంటలకు సంబంధించిన 45 రకాల వంగడాలను అందుబాటులో ఉంచారు. విత్తన మేళాకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా రైతులు తరలివచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, ఎమ్మెల్సీ వాణీదేవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధీర్కుమార్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.