PRLIS | కాలగమనంలో ఎప్పుడోగానీ అద్భుతాలు చోటు చేసుకోవు. దశాబ్దాలు గడిస్తే గానీ అచ్చెరువొందే సందర్భాలు తారసపడవు. అలా సాక్షాత్కరించిన నిఖార్సైన నిజాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. ఈ చారిత్రక సత్యం తెలంగాణ పురోగతిలో తారుమారైంది. ‘మిషన్ కాకతీయ’ ముచ్చట మరవకముందే ‘మిషన్ భగీరథ’, ఆ ఫలాలను ఆస్వాదిస్తుండగానే ఇంకో అనితర సాధ్యం ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా జల కేతనం రెపరెపలాడుతుండగానే.. మరో విజయ దుందుభి ‘పాలమూరు- రంగారెడ్డి’ జలజయధ్వానాలు మొదలయ్యాయి. ఇలా దశాబ్ది తెలంగాణలో ఏటేటా ఆవిష్కృతమవుతున్న అద్భుతాలన్నిటినీ చరిత్ర విస్తుపోయి చూస్తూనే, సగర్వంగా సువర్ణాక్షరాలతో తన పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా లిఖిస్తున్నది.
ఏమున్నది పాలమూరు.. పల్లేర్లు తప్ప! ఎక్కడున్నది పాలమూరు దేశంలోనే వెనుకబడ్డ జిల్లాల్లో తప్ప!! దశాబ్దాలుగా ఇదే చదివాం, విన్నాం. దాహమన్నది దరిచేరనీయకుండా తానున్నానని కృష్ణమ్మ సెలవిచ్చినా, కరువు రక్కసిని అడుగుపెట్టనివ్వకుండా తుంగ‘భద్రంగా’ చూసుకుంటానని ఉప్పొంగి చెప్పినా.. పాలమూరు రాత మారలేదు. ఉభయ నదులూ సంగమించి అభయమిచ్చినా… ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి తడారి ఎడారిగా మారిన ఈ ప్రాంతానికి గుక్కెడు తాగునీటిని ఇవ్వలేకపోయింది. కనీసం ఒక్కపంటకైనా సాగునీరు అందించలేకపోయింది. ఫలితం పాలమూరు కరువుకు చిరునామాగా మిగిలిపోయింది. ఈ కష్టాల మీద కవులు విషాద కవిత్వాలు రాసారు. “ఎంత సక్కని దానివే కృష్ణమ్మా/ఎటు దిక్కు వోతున్నవే కృష్ణమ్మా/ మునిగింది ఏ ఊరు, మురిసింది ఏ ఊరు/ ఉత్తర దక్షిణ జీవనదులుండగా/ కుత్తుకెండి నేల కుంగిపోయినాది” అని వాగ్గేయకారుడు గోరటి వెంకన్న విలపిస్తే, “బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే/ బంగారు పంటలు మీకు/ బంజరు భూములు మాకు!” అని దొంత భద్రయ్య వలపోశారు. “బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను/ కటకటా కరువమ్మ వచ్చి నిలుచుంటేను/ మా భూమి మా నీళ్లు దక్కి తీరేదాక/ మా ఆటలే ఆడుతాం, మా పాటలే పాడుతాం” అని తైదల అంజయ్య ముక్కుసూటి ముచ్చట రాసారు. ఏలికలే దత్తత తీసుకున్నా.. ఇక్కడి దుస్థితి మారలేదు. ఊరూరా బీడువారిన పొలాలు, నెర్రెలు వారిన చెరువులు, ముంబాయికి వలసలు, ఆత్మహత్యలు, తీరని వెతలు.. ఇలాంటి కఠోర నిజాలకు పాలమూరు చేవ్రాలుగా అరిగోసపడ్డది.
పాలకుడు తలచుకుంటే అసాధ్యాలకు ఆస్కారమే ఉండదు. నాయకుడు కంకణబద్ధుడైతే ఆశ్చర్యాలకు కొదువ ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, పారదర్శకతకు సజల సాక్ష్యం ‘పాలమూరు-రంగారెడ్డి’. శ్రీగిరి పాదాల చెంతనున్న పాతాళగంగను తోడుకొచ్చి, అంచెలంచెలుగా అందలమెక్కించి, కరువు సీమ నెత్తిన పన్నీరు చిలికించిన వైనం కేసీఆర్కే చెల్లింది. బీడువారిన నేలలో జలసిరులు పొంగించి పాలమూరు పాపిట సిరిధారల సిందూరాన్ని దిద్దారు ముఖ్యమంత్రి. ఈ బృహత్కార్యం మరో భగీరథ ప్రయత్నమే! రాష్ట్ర ఏర్పాటుతోనే ఒక్కో పెండింగ్ ప్రాజెక్టు నెలకొకటి చొప్పున పూర్తవుతూ పాలమూరు నసీబు మారడం మొదలైంది. తాజాగా ‘పాలమూరు-రంగారెడ్డి’తో ఉమ్మడి జిల్లా ముఖచిత్రం ఊహించనంతగా మారిపోనుంది. అనంత జలరాసిని ఒడిసిపట్టిన ఈ పథకం సామర్థ్యం 67.9 టీఎంసీలు. ప్రాజెక్టులో భాగంగా వెలసిన ఐదు జలభాండాగారాలు ఇంజినీరింగ్ వైచిత్రికి నిలువుటద్దాలు. పాతాళాన్ని తాకే సర్జ్పూల్స్, ఆకాశాన్నంటే భారీ మోటార్లు, నదీ ప్రవాహానికి వేగం నేర్పేంత పరవళ్లు.. ఇదీ ఈ ప్రాజెక్టు స్వరూపం. సముద్రమట్టానికి 240 మీటర్ల నుంచి 629 మీటర్ల ఎత్తులో కృష్ణమ్మను నిలబెట్టిన వైనం అమేయం!
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ ఆరు జిల్లాల పరిధిలో పన్నెండు లక్షల ముప్పయ్ వేల ఎకరాల ఆయకట్టుకు ఆయువుపట్టు ఈ ప్రాజెక్టు. 1226 గ్రామాలకు తాగునీరు అందించే గంగమ్మ ఈ నిర్మాణం. కేసీఆర్ కన్న నీటి కలలు సాకారమైన శుభ తరుణమిది. మనసు లేని వలసపాలకుల నయవంచనలను పటాపంచలు చేసిన స్వరాష్ట్ర సాధకుని తపోఫలమిది. కరువు నేలను జలధారలతో తడిపి మరో భాగ్యసీమగా మార్చిన అపర భగీరథమిది. నీటిగోసను శాశ్వతంగా పారదోలిన పాలమూరు కథ ఇది. పల్లె కన్నీటి పాటల్లోంచి నడిచొచ్చిన పచ్చదనాల జల జయకేతనమిది. కాలమా.. కొంచంసేపు ఆగిపో. కాలంతో పరుగులు తీసే ఓ చరిత్రా! ఈ సుందర దృశ్యాన్ని వీక్షించు. దశాబ్దాలుగా దురదృష్టం వెంటాడిన పాలమూరు తలరాత మారుతున్న వైనాన్ని దర్శించు. ఈ అదృష్ట సమయాన్ని అమాంతంగా దోచుకుని నీ పుటల్లో పదిలంగా దాచుకో!!
-తిగుళ్ల కృష్ణమూర్తి