హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎక్స్ప్రెస్.. పల్లె వెలుగు బస్సులు అనగానే వాటి స్వరూపం మన మనస్సుల్లో చమక్కుమంటుంది. ఇదే తరహాలో బడులు అంటే ఇలాగుంటాయి అని స్ఫురించేలా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలన్నింటికీ ఒకే కలర్ కోడ్ను అమలుచేస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఇది పాఠశాల అని గుర్తుపట్టేలా కామన్ కలర్ కోడ్ను వర్తింపజేస్తున్నారు. ఆరు బయట, ప్రహరీలకు ఒకే రకం రంగు వేయనుండగా, గదుల్లో ఐదు రకాల రంగులద్దనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు జోరందుకొన్నాయి. సివిల్ వర్క్స్ పూర్తికాగానే రంగులు వేసే పనులు చేపడుతున్నారు. మొదటి విడతలో 9,123 స్కూళ్లను ఎంపికచేయగా, ఇందులో ప్రధాన భాగం పేయింటింగ్స్దే. రాష్ట్రంలో మొత్తంగా 1,39,585 తరగతి గదులుండగా, తొలి విడతలో 71,115 గదులకు రంగులు వేయాలని అధికారులు నిర్ణయించారు. గోడలు, సీలింగ్, తలుపులు, కిటికీలు, గ్రిల్స్, గేట్లు, మూత్రశాలలు ఇలా అన్నింటికీ రంగులు వేయనున్నారు.
రంగులు ఇవే..
ఆరుబయట వేసేందుకు నీలం, తెలుపు రంగులను ఎంపిక చేయగా, ప్రహరీకి సైతం ఇదే రంగులు వేస్తారు. గదుల్లో మార్నింగ్ గ్లోరీ, నట్ బ్రౌన్, ఎనామిల్ ఓక్వుడ్, ఎనామిల్ వైల్డ్ మష్రూమ్, మిస్ట్రీవ్యాలీ, ఎనామిల్ ఇండియన్ స్పైస్, కాపర్ కోస్ట్ తదితర రంగులను ఎంపికచేశారు.
బాల కాన్సెప్ట్తో..
బడుల్లో అందంగా తయారైన గోడలు ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేస్తాయి. అర్థాలు చెప్తాయి. సొంతంగా నేర్చుకొనే అవకాశాన్ని ఇస్తాయి. ఈ గోడలే పుస్తకాలు.. ఈ గోడలే టీచర్లుగా మారుతాయి. బిల్డింగ్ యాజ్ ఏ లర్నింగ్ ఎయిడ్ (బాల) కన్సెప్ట్తో ఈ పాఠశాల గోడలపై అందమైన చిత్తరువులను చిత్రీకరించనున్నారు. గోడలకు రంగులు వేయడంతోపాటు పాఠ్యాంశ సంబంధమైన పటాలు, చిత్రాలు, అక్షరమాల, ఇతరత్రా బోధనాభ్యసన సామగ్రి బొమ్మలను వేయనున్నారు.