మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మన పట్టణం- మన బడి కార్యక్రమాన్ని గురువారం పోచారం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ బి.కొండల్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ, అదనపు గదుల నిర్మాణం, మధ్యాహ్న భోజన షెడ్లు తదితర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం7,300 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు.
తెలంగాణను ప్రగతి పథంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. పోచారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలో మన పట్టణం- మన బడి కార్యక్రమంలో భాగంగా కోటి ఇరవై మూడు లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేష్, వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, కౌన్సిలర్లు రాజశేఖర్, పోచమ్మ, సాయిరెడ్డి, శైలజ, బాల్రెడ్డి, మేనేజర్ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.