Tenth Exams | హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా( Vikarabad Dist ) తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1( Govt School )లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం( Telugu Question Paper ) బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి పరీక్ష వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పందించింది. రేపటి పదో తరగతి పరీక్ష వాయిదా పడలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రేపట్నుంచి ఈ నెల 13వ తేదీ వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఇక తెలుగు ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపిన వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు. ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపిన ఉపాధ్యాయుడు బందప్ప, మరో ఇన్విజిలేటర్ సమ్మప్ప, చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గోపాల్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీ దేవసేన తెలిపారు.