హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాలకు తెలంగాణ పథకాలే దారి చూపుతున్నాయి. మొన్నటికి మొన్న రైతుబంధును కాపీ కొట్టారు.. మిషన్ భగీరథను కాపీ కొట్టారు.. ఇప్పుడు మరో పథకాన్ని కాపీ కొడుతున్నారు. సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి పథకాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాపీ కొట్టింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అభ్యుదయ యోజన పేరుతో కొత్త పథకాన్ని అక్కడి బీజేపీ సర్కారు ప్రకటించింది. ఇప్పటికే రైతుబంధును పీఎం కిసాన్ సమ్మాన్, మిషన్ భగీరథను హర్ ఘర్ జల్ పేరుతో కేంద్రం కాపీకొట్టగా, ఈ వరుసలో తాజాగా మన ఊరు-మన బడి కార్యక్రమం చేరింది.
తెలంగాణ పథకం
మన ఊరు – మనబడి పథకంలో భాగంగా తెలంగాణ సర్కారు 12 అంశాలను తీసుకొని స్కూళ్ల రూపురేఖలను సమగ్రంగా మార్చుతున్నది. మొత్తం మూడు విడతల్లో 26 వేలకు పైగా స్కూళ్ల అభివృద్ధికి రూ.7,289.54 కోట్ల నిధులను వెచ్చిస్తున్నది. మొదటి విడతలో 9,123 స్కూళ్లకు రూ.3,497.62 కోట్లు ఖర్చుచేస్తున్నది. ఇప్పటికే తొలి విడత పనులు ప్రారంభం కాగా, ఇటీవలే 600 పైచిలుకు స్కూళ్లను ప్రారంభించారు. రెండో విడత, మరుసటి సంవత్సరంలో మూడో విడతలో మిగిలిన స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు శరవేగంగా కసరత్తు చేస్తున్నది.
ఉత్తరప్రదేశ్ పథకం
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి అభ్యుదయ యోజనను యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఒక్కో బ్లాక్కు 4-5 స్కూళ్లు తీసుకొని మొత్తంగా 4 వేల స్కూళ్లను రాబోయే మూడేండ్లలో అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.