60 ఏండ్లలో 2,850 ఎంబీబీఎస్ సీట్లే తెలంగాణ ఏర్పడే నాటికి.. అంటే 60 ఏండ్లలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్యను 8,515 సీట్లకు పెంచుకున్నామని మంత్రి హరీశ్రావు చెప్పారు. 1,183 పీజీ (మెడికల్) సీట్లు ఉంటే ఆ సంఖ్య 2,890కి పెరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో దేశం మొత్తం 2,200 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో ఏర్పడితే, అందులో 900 సీట్లు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. అంటే.. దేశం మొత్తంలో 43 శాతం ఎంబీబీఎస్ సీట్లు ఒక్క తెలంగాణలోనే ఏర్పడ్డాయని తెలిపారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని వెల్లడించారు. ప్రతి లక్ష జనాభాకు 8 పీజీ సీట్లతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఒక్కో విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకు రూ.30 లక్షలు, పీజీకి రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చదువుకు రూ.75 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. తెలంగాణలో 40 వేల మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. దేశంలో డబ్ల్యూహెచ్వో సూచనలకు దగ్గరలో ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. భవిష్యత్తులో కరోనా వంటి పరిస్థితులు వచ్చినా తెలంగాణకు వచ్చిన ఇబ్బదేం లేదని స్పష్టంచేశారు. దేశమంతటికీ వైద్యం అందించే స్థాయికి తెలంగాణ ఎదుగుతున్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. అప్పుల కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు బాల్క సుమన్, ఆరూరి రమేశ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎంవోఎస్పీఐ నివేదిక ప్రకారం ఆగస్టు 1 నాటి కి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,12,398 ఉన్నదని తెలిపారు. ఇది దేశంలోనే మూడో స్థానమని, పెద్దరాష్ర్టాలతో పోలిస్తే దేశంలోనే నం బర్ వన్ స్థానంలో తెలంగాణ ఉన్నదని వివరించారు. తెలంగాణ ఏర్పడేనాటికి రూ.1,12,163 తలసరి ఆదాయంలో రాష్ట్రం 10వ స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. 9 ఏండ్లలోనే హిమాచల్ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్, హర్యానాలను దా టేసి మూడో స్థానానికి ఎగబాకిందని చెప్పారు. మూలధన వ్యయంలో దేశం కంటే తెలంగాణ 20 శాతం ఎక్కువగా వెచ్చిస్తున్నదని తెలిపారు. దేశంలో అతితక్కువ అప్పులు చేస్తున్న రాష్ర్టాల జాబితాలో కింది నుంచి 5వ స్థానంలో తెలంగాణ ఉన్నదని గుర్తుచేశారు.
తెలంగాణ వచ్చినప్పుడు జీఎస్డీపీ రూ.4,51,580 కోట్లు ఉండేదని, ఇప్పుడు… రూ.13,13,391 కోట్లకు ఎగబాకిందని చెప్పారు. తెలంగాణ జీఎస్డీపీ 12.7 శాతం ఉండగా, దేశ జీడీపీ 10.5 శాతమేనని వివరించారు. ఇదంతా.. రాత్రికి రాత్రే జరగలేదని, సీఎం కేసీఆర్ పటిష్ఠ ఆర్థిక ప్రణాళికతోనే సాధ్యమైందని తెలిపారు. సాగునీటి సదుపాయాలు, జలవనరుల పునరుద్ధరణ కోసం చేపట్టిన లక్షిత ప్రాజెక్టులు, వ్యవసాయ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, వ్యవసాయ క్షేత్ర కార్యకలాపాల యాంత్రీకరణ వంటి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైందని తెలిపారు. టీఎస్ ఐపాస్ వంటి వ్యాపా ర సంసరణలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం టీ ఐడియా, టీ ప్రైడ్ వంటి పథకాలు, పారిశ్రామిక ఆరోగ్య కేంద్రాలు, టీఎస్ గ్లోబల్ లింకర్లతోపాటు ఎంఎస్ఎంఈ రంగానికి బహు ళ చర్యలు, ప్రభుత్వం చేపట్టిన సాప్, సాపీయో అనలటిక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలతో గల భాగస్వామ్యం పారిశ్రామిక రంగాన్ని పటిష్ఠ పరిచిందని వివరించారు. తద్వారా రాష్ట్రంలో కంపెనీల స్థాపన సులభమైందని, అనేక కంపెనీలు తెలంగాణకు వచ్చాయని వెల్లడించారు. పారిశ్రామిక రంగం, ఉత్పత్తి రంగం బలోపేతం కావడంతో పట్టణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైందని తెలిపారు. కేంద్రం ఆర్థికంగా సహకరించకున్నా.. రాష్ట్రం సొంతకాళ్లపై ఆర్థికంగా ఎదుగుతున్నదని చెప్పారు. కేంద్రం ప్రస్తుతం రూ.800 కోట్ల జీఎస్టీ బకాయిలు రాష్ర్టానికి ఇవ్వాల్సి ఉన్నదని స్పష్టంచేశారు.
ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లు
వైద్యరంగంలో తెలంగాణ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, ఎం సంజయ్, మెతుకు ఆనంద్, అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నలకు హరీశ్రావు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఇప్పుడు.. వైద్యుల ఉత్పత్తిలోనూ అగ్రస్థానంలో నిలుస్తున్నామని వెల్లడించారు. ఒకప్పుడు తెలంగాణ పిల్లలకు డాక్టర్ చదువు ఒక కలలా ఉండేదని, ఆ కలను నిజం చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో వైద్యవిద్య చదివే పరిస్థితి లేక.. విద్యార్థులు పక్క రాష్ర్టాలు, వేరే దేశాలకు వెళ్లి చదువుకునేవారని గుర్తుచేశారు. ఉక్రెయిన్, రష్యా, చైనాకు వెళ్లి మెడిసిన్ చదివే క్రమంలో అక్కడి భాష నేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారని చెప్పారు. అటువంటిది ప్రస్తుతం దేశంలోనే అతితక్కువ ఎంబీబీఎస్ ఫీజు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని వివరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం జిల్లాకో డిగ్రీ కాలేజీ కూడా లేదని, రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో అంత దయనీయమైన పరిస్థితి ఉంటే.. ప్రస్తుతం డిగ్రీ కాలేజీలే కాదు.. ఏకంగా జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్: నిరంజన్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 40 వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్పామ్ సాగు కాగా, తాము అధికారంలోకి వచ్చిన తర్వా త 1.18 లక్షల ఎకరాలకు పెంచామని తెలిపారు. 2023-24 సంవత్సరంలో కొత్తగా 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు రూ.750 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆయిల్పామ్ సాగుపై శనివారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్రెడ్డి సమాధానాలిచ్చారు. దేశంలో 250 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు వాడుతుండగా, 130 లక్షల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతున్నదని, మిగిలిన నూనెలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో 38 ఆయిల్ పామ్ నర్సరీలున్నాయని, మరో మూడు ఆయిల్పామ్ ఫ్యాక్టరీలకు నిర్మల్, వనపర్తి, మంచిర్యాలల్లో భూమిని కేటాయించామని చెప్పారు.
పచ్చదనం పెంపులో తెలంగాణ ఫస్ట్: ఇంద్రకరణ్రెడ్డి
పచ్చదనం పెంపులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. హరితవనాలు, పచ్చదనం పెంపుపై ప్రభు త్వం తీసుకున్న చర్యలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ైద్వెవార్షిక మదింపు నివేదిక ప్రకారం 2015 నుంచి 21 వరకు అటవీ, చెట్ల సంచిత పెరుగుదల 4,25,259 ఎకరాలుగా ఉన్నదని, ఇది 2015లోని పచ్చదనం కంటే 7.7 శాతం అధికమని వివరించారు. 2015 నుంచి 23 వరకు 284 కోట్ల మొక్కలను నాటడం లేదా పునరుజ్జీవింపజేశామని చెప్పారు. మరో 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పునరుజ్జీవింపజేశామని, 109 పట్టణ పార్కులను అభివృద్ధిచేసి, వీటిలో 73 పార్కులను పూర్తిచేసి ప్రజల కోసం తెరిచామని తెలిపారు. 2015 నుంచి 2023 వరకు 284 కోట్ల మొక్కలను నాటామని, ప్రత్యేకంగా హరితనిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. పచ్చదం పెంపు అంశంలో రాష్ట్రం అనేక అవార్డులను గెలుచుకున్నదని గుర్తుచేశారు.
సింగరేణిని ప్రైవేట్పరం కానివ్వం: జగదీశ్రెడ్డి
సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు సింగరేణి సంస్థను ప్రైవేట్పరం కానివ్వబోమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. మరో 20 ఏండ్లు తామే అధికారంలో ఉంటామని, సింగరేణిని కాపాడుకుంటామని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సింగరేణి సంస్థపై ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోరుకంటి చందర్, బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నడిపెల్లి దివాకర్రావు అగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్తు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బతికిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. సింగరేణిలో ఏ గనిని కూడా ఇతరులకు వేలంలో ఇచ్చే ఆస్కారం లేదని, నిక్షేపాలను సైతం సింగరేణికే కేటాయించాలని సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులను కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేశామని, త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తమని వెల్లడించారు.
అర్హులందరికీ స్కాలర్షిప్లు: కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ సాలర్ షిప్స్ కేంద్ర సహాయాన్ని ఆశించకుండా అర్హులైన ఎస్సీ విద్యార్ధులందరికీ శాచురేషన్ మో డ్లో ఇస్తున్నామని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కాలర్షిప్ ఈ పథకాన్ని పారదర్శకంగా ఈ-పాస్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో సా లర్ షిప్స్ కోసం రూ.606 కోట్లు కేటాయించామని, వీటిలో ఎం టీఎఫ్ రూ.103 కోట్లు, ఆర్టీఎఫ్ రూ. 347 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. 2.25 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు. దళిత బంధు కింద ఇప్పటి వరకు 38,323 మందికి రూ.3870 కోట్లు అందించామని తెలిపారు. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1100 మందికి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.
చేపల ఉత్పత్తి భారీగా పెరిగింది: తలసాని
రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2018-19లో 2.94లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే 2022-23 నాటికి అది 4.38 లక్షల ట న్నులకు పెరిగిందని వివరించారు. 2014-15 నుంచి 2022-23 వరకు రూ.419 కోట్ల చేప పిల్లలను, 28.36 కోట్ల రోయ్య పిల్లలను పంపిణీ చేశామని చెప్పారు. 3.26 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం కల్పిస్తూ రూ.1000 కోట్ల ఖర్చుతో సమీకృత మత్స్య పరిశ్రమ అభివృద్ధి పథకాలను అమలు చేశామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా గొర్రెల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉన్నదని మంత్రి తలసాని తెలిపారు. తెలంగాణలో 1.91 కోట్ల గొర్రెలు ఉన్నట్టుగా కేంద్రమే చెప్పిందని గుర్తుచేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైందని, 4,786 యూనిట్లను పంపిణీ చేశామని చెప్పారు.
ఎంబీసీలకూ రూ.లక్ష సాయం: గంగుల కమలాకర్
వెనకబడిన తరగతుల వర్గాలతో సమానంగా ఎంబీసీలకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారికి 2018 నుంచి 1419 మందికి రూ.7.09 కోట్లను అందించామని తెలిపారు. వెనకబడిన వర్గాలవారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా అందించే లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఒక్కో దఫాలో ప్రతి నియోజకవర్గంలో 300 మందికి అందిస్తామని చెప్పారు. 2023-24లో ఈ పథకానికి రూ.400 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
సింగరేణిని నిర్వీర్యం చేసేందే కాంగ్రెస్: బాల్క సుమన్
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేంది.. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది కాంగ్రెస్ పార్టీయేనని అసెంబీలో బీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు తీరును అసెంబ్లీ వేదికగా తుర్పారబట్టారు. ఓపెన్కాస్టుల సంస్కృతిని ప్రారంభించింది, ప్రైవేట్పరం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. 42 మైన్స్, 40 వేల వర్కర్లు, 33 వేల కోట్ల టర్నోవర్తో ఉన్న సింగరేణి సంస్థపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చడం తగదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరించారని, 16 వేల మంది బిడ్డలకు ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. సింగరేణి మీద కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కులేదని, కాంగ్రెస్ బొగ్గు స్కాం చేయడం వల్లే ఎంఎండీఆర్ యాక్ట్ను తెచ్చామని కేంద్రం పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
అసెంబ్లీలో జీరో అవర్లో 44 ప్రశ్నలు
అసెంబ్లీలో జీరో అవర్లో 44 అంశాలపై ప్రశ్నలు అడిగారు. మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్స్, రుణాలపై అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఉప్పల్లో డిగ్రీ కాలేజీ, 100 పడకల దవాఖానకు స్థలం కేటాయించాలని, మల్టిప్లెక్స్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉప్పల్ -నారపల్లి రహదారిని పూర్తిచేయాలని బేతి సుభాష్రెడ్డి కోరారు. రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని హన్మంత్షిండే, అంజయ్యయాదవ్, విఠల్రెడ్డి, క్రాంతికిరణ్, దాసరి మనోహర్రెడ్డి, ఆరూరి రమేష్, రేఖానాయక్ విజ్ఞప్తి చేశారు. జనగామ చెరువుకు రూ.10 కోట్లు, మున్సిపాలికి నిధులివ్వాలని ముత్తిరెడ్డి యాదగిరిరెడి కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని బాజిరెడ్డి గోవర్ధన్, ఐకేపీ వీవోఏల కనీస వేతనాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కొత్త మండలాలు ఏర్పాటు, అనంత పద్మనాభ స్వామి దేవాలయ అభివృద్ధి చేయాలని, మరికొన్ని అంశాలపై కూడా పలువురు ప్రశ్నలు అడిగారు. మంత్రులు స్పందిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.