సిద్దిపేట, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు. ఇంత ఎండాకాలంలో చెరువులు అలుగులు పారుతుంటే ఇది వానకాలంలా ఉన్నదని అన్నారు. బుధవారం సిద్దిపేటలోని 21వ వార్డులో భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్లొన్నారు. సిద్దిపేట కేసీఆర్నగర్లో నిరుపేద ముస్లింలకు 550 రంజాన్ కానుకలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయిల్పామ్, సెరీకల్చర్ తదితర పంటలతోపాటు కమర్షియల్ పంటలను సాగు చేసి రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని మూడున్నరేండ్లలోనే పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నామని అన్నారు. అందరి సహకారంతో అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఏ అవార్డు వచ్చినా, అది సిద్దిపేటకే వస్తుందని, ఇప్పటివరకు జాతీయ, రాష్ట్రస్థాయిలో 18 అవార్డులను సాధించడం గొప్పవిషయమని తెలిపారు. ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తామని, అక్కడి నుంచి హరితహారంలో నాటిన మొక్కలకు, పంట పొలాలకు వినియోగిస్తారని వివరించారు. సిద్దిపేటను పరిశుభ్ర పట్టణంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో విద్య, వైద్య, మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ ఇలా ఎన్నో విద్యా సంస్థలు, మరెన్నో అభివృద్ధి పనులు పూరిచేశామని వివరించారు.
త్వరలోనే 13 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
రాష్ట్రంలో త్వరలోనే 13 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో బోధన జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించేందుకు రూ.7,300 కోట్లతో ‘మన ఊరు- మన బడి’ పథకం తీసుకొచ్చి అమలు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని నిరుపేద ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ కానుక అందిస్తున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ మంజులారాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తదితరులు పాల్లొన్నారు.