హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం పెరిగాయని కాగ్ నివేదిక (CAG) వెల్లడించింది. అయితే రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివేదికను శాసనసభలో విడుదల చేసింది. 2021-22తో పోలిస్తే 2022-23లో రాష్ట్ర జీఎస్డీపీ 16 శాతం పెరిగిందని అందులో పేర్కొంది. రెవెన్యూ రాబడులు 25 శాతం పెరిగాయని, రెవెన్యూ రాబడుల వృద్ధిరేటు ఒక శాతం తగ్గిందని తెలిపింది. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17 శౠతం వృద్ధి చెందిందని వివరించింది.
సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగిందని చెప్పింది. 2023 మార్చి నాటికి పూర్తికావాల్సిన 20 ప్రాజెక్టుల అచనా వ్యయం అధికమయిందని వెల్లడించింది. అదేవిధంగా రూ.2749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని తెలిపింది. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్లు 150 శాతం మెర పెరిగాయి. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసింది. 2022-23 బడ్జెట్లో వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ.17,829 కోట్లు అందించింది.
రాష్ట్ర అభివృద్ధి రుణాల వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని పేర్కొన్నది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు భారీగా అంచనా వేస్తున్నారని వివరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని తెలిపింది. ఇండ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్పామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదని పేర్కొంది. దళితబంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది.