హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 73 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 2,606 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేలు దాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య 1500 దాటింది. శనివారం 1,583 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లోనూ కరోనా విజృంభిస్తున్నది. ములుగు మినహా అన్ని జిల్లాల్లో శనివారం కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 292, రంగారెడ్డిలో 214, సంగారెడ్డిలో 59, మహబూబాబాద్లో 53, హన్మకొండలో 45, ఖమ్మంలో 41 కేసులు వెలుగుచూశాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల మందికి కొవిడ్ టీకాలు వేశారు. 1.51 లక్షల మందికి మొదటి డోస్, 1.29 లక్షల మందికి రెండో డోస్ వేశారు. 15 నుంచి 18 ఏండ్ల వారికి ఇప్పటివరకు 6,81,516 డోసులు వేశారు. మొత్తం లక్ష్యంలో ఇది 37 శాతం. రాష్ట్రంలో 35.49 లక్షల డోసులు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో 54,628 పడకలు అందుబాటులో ఉన్నాయి.