Deeksha Divas | 2009, డిసెంబర్ 4.. నిమ్స్ దవాఖాన..
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్.. మెతుకు ముట్టక ఆరు రోజులవుతున్నది. షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. ఒంట్లో సత్తువ లేదు. రెండు చేతులు జోడించి దండం పెట్టేందుకు కూడా శక్తి చాలడం లేదు. ఆరోగ్యం క్షీణిస్తున్నది. దీక్షను కొనసాగిస్తే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీక్షను విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది.
శారీరకంగా ఆయన బలహీనపడ్డారు కానీ మానసికంగా దృఢంగా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకా వందేండ్లయినా తెలంగాణ రాదని, రానివ్వరని బలంగా నమ్మారు. ‘నేను చచ్చినా పర్వాలేదు.. తెలంగాణ వస్తే చాలు’ అని సంకల్పం తీసుకున్నారు. ఈ సత్సంకల్పమే ఆయనకు దీక్షను కొనసాగించే శక్తినిచ్చింది.
నవంబరు 29న దీక్షకు సిద్ధమైన కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది. జైలులోనే ఆయన దీక్షను చేపట్టారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆయనను ఖమ్మం జైలు నుంచి డిసెంబర్ 3న హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. కేసీఆర్ అరెస్టుకు చలించి ఆత్మబలిదానానికి ఒడిగట్టిన శ్రీకాంతాచారి అదే రోజు రాత్రి మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఒకవైపు హైదరాబాద్కు తరలించిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతున్నట్టు వైద్యుల హెచ్చరిక, మరోవైపు శ్రీకాంతాచారి మృతితో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంతటా ఉద్రిక్త, ఉద్విగ్న పరిస్థితులు. అది తుఫాన్ ముందటి ప్రశాంతతలాంటిది. ఏ క్షణంలోనైనా బద్ధలయ్యే అగ్నిపర్వతంలా తెలంగాణ ఉన్నది. అదే జరిగితే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం. తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా ఉద్యమకారులు భారీ సంఖ్యలో హైదరాబాద్కు తరలిరావడం మొదలయ్యింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.
నిమ్స్కు వచ్చిన దానం నాగేందర్
నిమ్స్ వెలుపల బారికేడ్లు, ముండ్ల కంచెలు, సాయుధ పోలీసు బలగాలతో కట్టుదిమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ముఖ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణ మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. కేసీఆర్ను దీక్ష విరమింప జేయకపోతే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఒక మంత్రిని నిమ్స్కు పంపించి కేసీఆర్కు నచ్చజెప్పి దీక్షను విరమించేలా చేయాలని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిమ్స్కు వెళ్లి కేసీఆర్కు నచ్చజెప్పాలని అప్పటి వైద్యశాఖ మంత్రి దానం నాగేందర్ను ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించారు. నిమ్స్కు దానం నాగేందర్ వస్తున్నట్టు టీవీ చానల్స్లో బ్రేకింగ్ న్యూస్ రావడంతో అక్కడ పెద్దఎత్తున మోహరించిన మీడియా అప్రమత్తం అయ్యింది. నిమ్స్కు మంత్రి వచ్చే దృశ్యాన్ని చిత్రీకరించడానికి కెమెరాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యింది. అయితే, దానం మీడియా కండ్లుగప్పి నిమ్స్ వెనుక గేటు నుంచి లోపలికి వెళ్లారు. అప్పుడు దవాఖాన ఆవరణలో ఉన్న కేసీఆర్ కూతురు కవితకు ఈ సమాచారం అందడంతో హడావుడిగా లోపలికి వెళ్లింది. అప్పటివరకు ఆమెతో కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్న నేను కూడా ఆమె వెంట కేసీఆర్కు చికిత్స అందిస్తున్న రూమ్ నంబర్ 228లోకి వెళ్లాను. అప్పటికే అకడ దానం నాగేందర్ కూడా ఉన్నారు.
మాకు ఇజ్జత్ ఇస్తున్నారంటే మీ పుణ్యమే: దానం
కేసీఆర్కు చికిత్సను అందిస్తున్న గదిలో డాక్టర్లు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావుతో దానం నాగేందర్ చర్చించారు. దీక్ష విరమించకపోతే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉన్నదని, షుగర్, బీపీ లెవల్స్ పడిపోతున్నాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లతో మాట్లాడటం ముగిశాక కేసీఆర్తో మంత్రి నాగేందర్.. ‘అన్నా.. విన్నారా.. దీక్ష విరమించకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు. నా మాట వినండి. ఒక మంత్రిగా చెప్పడం లేదు. ఒక తమ్మునిగా అడుగుతున్నా. దీక్షను విరమించండి. మీరు, మేము అందరం కలిసి రాష్ట్రాన్ని తెచ్చుకుందాం . సీఎం రోశయ్య తన చేతిలో ఏమీ లేదని, అలాంటప్పుడు ఎలా హామీ ఇవ్వగలనని అంటున్నారు. మీ వల్లనే మాకు అంతోఇంతో గుర్తింపు, ఇజ్జత్ ఇస్తున్నారు. లేకపోతే మమ్మల్ని ఎవ్వరూ దేకరు. ఈ ఒకసారికి నా మాట వినండి’ అంటూ రెండు చేతులు జోడించి వేడుకున్నారు. మంచంపై లేవలేని స్థితిలో ఉన్న కేసీఆర్ రెండు చేతులు బలవంతంగా జోడిస్తూ ‘ఆయన(రోశయ్య) పరిధిలో ఉన్నదే చేయమను. అసెంబ్లీలో తీర్మానం చేయడానికైతే ఇబ్బంది లేదుగా’ అని నిస్సత్తువ స్వరంతో ప్రశ్నించారు. ‘ఆయనేమో తన చేతిలో లేదంటున్నారు. మీరు మరోసారి ఆలోచించండి. డాక్టర్లు మీ ప్రాణాలకే ప్రమాదమంటున్నారు’ అని దానం అన్నారు. చేతికి స్లైన్ బాటిల్ పైప్లు ఉండటంతో ఛాతిపై రెండు చేతులు జోడించి కేసీఆర్ తల అడ్డంగా తిప్పారు. మంత్రి దానం తిరిగి వెళ్తూ అకడే నిలబడ్డ కవిత వైపు చూస్తూ.. ‘మీరైనా సముదాయించండి’ అని వెళ్లిపోయారు.
కవితను వారించిన కేసీఆర్
తండ్రి ఆరోగ్యం క్షీణిస్తున్నదనే డాక్టర్ల హెచ్చరికలు అక్కడే ఉన్న కవితను ఆందోళనకు గురిచేశాయి. ఆమె కేసీఆర్ను చూడకుండా ఉండలేకపోతున్నారు. కానీ, పేగుబంధం ఎక్కడ తనను మానసికంగా బలహీనం చేస్తుందో అనేది కేసీఆర్ భయం. అందుకే, దవాఖానలో తనవద్దకు వచ్చిన కుమార్తెను ఆయన వారించారు.
‘చచ్చినా పర్వాలేదు.. తెలంగాణ వస్తే చాలన్న దృఢ సంకల్పం తీసుకున్నా. అన్ని బంధాలు తెంచుకొని వచ్చే ఆమరణ నిరాహార దీక్షకు దిగాను. కన్నపిల్లలు కండ్ల ముందు కనబడితే మనసు మారుతుందేమో, పేగుబంధానికి మనసు చలిస్తుందేమో.. ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. నన్ను చూడటానికి రావద్దని పిల్లలకు ముందే చెప్పాను. అయినా నా కండ్ల ముందు తిరిగితే ఎలా?’ అని కూతురు కవిత వైపు ఆగ్రహంతో చూస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఈ మాటలు అంటుంటే కేసీఆర్ కండ్లల్లో నుంచి నీళ్లు సుడులుగా తిరిగాయి. నిమ్స్లో చోటుచేసుకున్న ఈ భావోద్వేగ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్ పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకుందామని పత్రికా విలేఖరిగా ఆసక్తితో కవిత వెంట ఆయన ఉన్న గదిలోకి వెళ్లినపుడు చోటు చేసుకున్న సన్నివేశం ఇది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావోరేవో అని సిద్ధపడ్డ కేసీఆర్, తన ఆమరణ నిరాహార దీక్షలో ఎంతటి తెగింపు, పట్టుదల, చిత్తశుద్ధితో ఉన్నారో చూసిన ప్రత్యక్ష సాక్షిని. అయితే, కేసీఆర్ దీక్షపై అప్పుడప్పుడు కొందరు చేసే వెకిలి వ్యాఖ్యలు విన్నప్పుడు నిమ్స్లో నేను ప్రత్యక్షంగా చూసిన భావోద్వేగ సన్నివేశం ఇప్పటికీ నా కండ్లముందు కదలాడుతుంది.
డిసెంబర్ 9 నాటి పరిణామాలు
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకుంది. దీక్ష కొనసాగిస్తే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించారు. తెలంగాణపై ప్రకటన రానిదే తాను దీక్ష విరమించేది లేదని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రోశయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది. ఇటు రాష్ట్ర అసెంబ్లీలో కూడా తెలంగాణపై తీర్మానం చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. పార్లమెంటులో కూడా ఎంపీలు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో రోశయ్య, ఇటు పార్లమెంటులో స్పీకర్ మీరాకుమార్ ఇద్దరూ కేసీఆర్ను దీక్ష విరమించుకోవాలని కోరారు. కేంద్రమంత్రి చిదంబరం కూడా కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణపై ప్రకటన రానిదే తాను దీక్ష విరమించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాత్రి 8 గంటలకు సోనియా గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ ఏర్పాటు చేయక తప్పదనే నిర్ణయానికి వచ్చారు.