హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : వరినాట్లు ఊపందుకోవడం.. వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నది. దీంతో కరెంట్కు డిమాండ్ అధికమవుతున్నది. నిరుడుతో పోల్చితే ఈ సారి ఇప్పటికే 44.4 శాతం డిమాండ్ పెరిగింది. గురువారం ఉదయం 10 గంటల వరకు 13,056 మెగావాట్ల రికార్డు వినియోగం నమోదయ్యింది. ఇందులో 8 వేల మెగావాట్ల వినియోగం దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఈ డిస్కం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లోను 4 రోజులుగా విద్యుత్తు డిమాండ్ పెరిగిపోతున్నది. గ్రేటర్లో రోజువారీ విద్యుత్తు డిమాండ్ 2,900 మెగావాట్లకు చేరుకున్నది. నిరుడు ఇదే రోజున కేవలం 8 వేల మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉండగా, ఏడాది వ్యవధిలోనే అదనంగా 4 వేల మెగావాట్ల డిమాండ్ పెరిగి 12 వేలకు చేరుకొన్నది.