హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): వారసత్వ రాజకీయాలంటూ ప్రధాని మోదీ మాట్లాడటం.. దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్టుగా విడ్డూరంగా ఉన్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి మోదీకి అసలైన వారసుడు అదానీ అని, అతని బాగుకోసమే మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. అందుకే అదానీ బాగుండాలంటే మోదీకి ఓటేయాలని, రైతులు, దేశం, ప్రజలు బాగుండాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మోదీ చేసిన వ్యాఖ్యలను మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు బీజేపీ అని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి అమిత్షా నుంచి కిందిస్థాయి వరకు బీజేపీలో వారసత్వమే రాజ్యమేలుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతల కుటుంబాలే నడిపిస్తున్నాయని, పదవులన్నీ వారి కుటుంబసభ్యులకే ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు. అమిత్షా కొడుకు జైషాకు బీసీసీఐలో ఏ అర్హతతో పదవి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, అనురాగ్ఠాకూర్, పీయూష్గోయల్తోపాటు పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు రాజకీయాలు చేస్తున్నారని వివరించారు. అలాంటి బీజేపీలో ఉన్న మోదీ ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్న సంగతి ఎప్పుడో ప్రధానికి అర్థమైందని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి మోదీకి భయం పట్టుకున్నదని చెప్పారు. రాబోయే పార్లమెంట్, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమనే టెన్షన్ పట్టుకున్నదని, ఆ ఫ్రస్టేషన్లోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు.