Y Satish Reddy | ములుగు : ఓటమి ఖరారైందని భావించి… ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇష్టారీతిగా మాట్లాడుతూ.. రాజకీయ డ్రామాలు చేస్తున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేయాలని సీతక్క చూస్తున్నారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంటే ధర్నాలు చేయించారు. సీడీపీ నిధుల పేరుతో కోర్టుకు వెళ్లారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని మీరు కోర్టుకు పోయారు. ఇదంతా రాజకీయ డ్రామా. సీతక్క పబ్లిసిటీ కోసమే కోర్టుకు వెళ్లారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల్లో ప్రభుత్వం వివక్ష చూపిస్తుందనేది పెద్ద అబద్ధం. నిబంధనల ప్రకారం గత ప్రభుత్వాల మాదిరిగానే నిధులు ఇచ్చాం. కానీ పనులు మొదలుకాకుండానే సగం నిధులు విడుదల చేయాలని అడగడాన్ని బట్టి ఆమె దురుద్దేశం అర్థమవుతోంది. లంబాడ బిడ్జ అయిన మంత్రి సత్యవతి రాథోడ్ను టార్గెట్ చేశారు. దురుద్దేశంతోనే కోర్టు పిటిషన్లో మంత్రి పేరు ప్రస్తావించారు. మరోవైపు సీతక్క కోర్టు పిటిషన్లో కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు తప్పా ప్రజల పనికొచ్చే ఒక్క అంశం కూడా లేదని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఉన్నా కూడా మా ప్రభుత్వం ఎక్కడా వివక్ష చూపలేదు అని సతీష్ రెడ్డి తెలిపారు. మా ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినా కూడా ములుగుని జిల్లా చేసుకున్నాం. ఎవ్వరు అడగకపోయినా కూడా ములుగుని మున్సిపాలిటీ చేసుకున్నాం. మొన్నటికి మొన్న మల్లంపల్లి మండలాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో రెండు నియోజకవర్గాల్ని హెల్త్ ప్రొఫైల్కి సెలెక్ట్ చేస్తే అందులో ఒకటి సిరిసిల్ల అయితే రెండోది ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఈ ములుగు అసెంబ్లీ నియోజకవర్గం అని తెలిపారు.
ములుగు జిల్లాలో రూ. 180 కోట్లతో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసుకున్నాం అని సతీష్ రెడ్డి గుర్తు చేశారు. 60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు డిగ్రీ కాలేజీ కోసం కొట్లాడాల్సి వచ్చింది. మీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవ్వరికీ, ఏ రాజకీయ సంబంధం లేకుండా కూడా జరుగుతున్నవి. మంథని నియోజకవర్గంలో 140 శాతం ఇళ్లతో అవినీతి చేసిన ఘనత మీది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పని చేస్తున్నారు. ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు కింద రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్లో ఓడిపోయినా దళితబంధు ఇచ్చాం. మొత్తం ములుగులో 1100 మందికి దళిత బంధు వచ్చింది. మొదటి విడత వంద మందికి ఇస్తే అందులో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వారికి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, ఇచ్చుకున్నారు. మరి అప్పుడు ధర్నాలు ఎందుకు చేయలేదు.? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేరాఫ్. అలాంటి పార్టీలో ఉన్న మీరు సంక్షేమానికి కేరాఫ్ అయిన బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి మించిన అవివేకం మరొకటి లేదు అని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు.