Redco Chairman Satish Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ పార్టీ ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని రెడ్కో చైర్మన్ వై. సతీష్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించాకే మిగతా అంశాలపై మాట్లాడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం వచ్చే 39 మంది సభ్యులు, ఇతర పార్టీ నేతలను డిమాండ్ చేశారు. సీఎం అభ్యర్థిని డిక్లేర్ చేసే కాంగ్రెస్ పార్టీకి దమ్ములేదని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఢిల్లీ నుంచి వస్తున్న ఏఐసీసీ, సీడబ్ల్యూసీ సభ్యులంతా అనేక అవినీతి కార్యకలాపాల్లో మునిగిన స్కామర్లు అని వై సతీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ప్రత్యేకించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అతిపెద్ద అవినీతి పరుడని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా తమ పార్టీ సీఎం అభ్యర్ధి కేసీఆరే అని తాము గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి తమ అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు.
దేశంలో మరే రాష్ట్రంలోలేని విధంగా ఆ మాటకొస్తే దేశమే ఆదర్శంగా చూస్తున్న సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు ఆరాధనాభావంతో చూస్తున్నారని వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ అని నోటికొచ్చిన స్కీములన్నీ ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నుఎండబెట్టి, తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న పార్టీ, ఓ అవినీతి పరుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి మరోసారి దోపిడీకి తెర తీయనున్నారని ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు.