హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత విద్యుత్తు రంగంలో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఓవరాల్ గరిష్ఠ డిమాండ్ 15,497 మెగావాట్లు (30.3.2023) నమోదు కాగా, శుక్రవారం ఉదయం మరో రికార్డు నెలకొంది. సొంత రాష్ట్రం ఏర్పడ్డ తరువాత వానకాలం (ఖరీఫ్) సీజన్లో ఎన్నడూ రానంతగా శుక్రవారం ఉదయం 11.21 గంటలకు 14,361 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది.
గత తొమ్మిదేండ్లలో ఏ వానకాలం సీజన్లోనూ ఇంతగా డిమాండ్ రాలేదు. వర్షాలు కాస్త నెమ్మదించడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటల సాగుకు విద్యుత్తు అవసరాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే గరిష్ఠ డిమాండ్ ఏర్పడిందని విద్యుత్తు శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం నమోదైన గరిష్ఠ డిమాండ్లో సింహభాగం దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థదే ఉన్నది. 14,361 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్లో ఎస్పీడీసీఎల్ది 9,577 మెగావాట్లు ఉండగా, ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)ది 4,430 మెగావాట్లు మాత్రమే. గత వానకాలం సీజన్లో గరిష్ఠ డిమాండ్ 12,251 మెగావాట్లుగా నమోదైంది.