హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ): ఒకే ఏడాది 52 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటడం ద్వారా తెలంగాణ రికార్డు సృష్టించిందని వ్యయసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వచ్చే మూడు నెలల్లో మరో 70 వేల ఎకరాల్లో సాగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో మార్చి నాటికి రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం 1.2 లక్షల ఎకరాలకు చేరుకోనున్నదని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్లోని ఉద్యానశాఖ కార్యాలయంలో ఆయిల్పామ్ సాగుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా బొప్పాస్పల్లి విత్తనక్షేత్రంలో ఆయిల్పామ్ రిసెర్చ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 11 ఆయిల్పామ్ కంపెనీల ద్వారా 1,502 ఎకరాల్లో 38 ఆయిల్పామ్ నర్సరీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2023-24లో కోటి ఆయిల్పామ్ మొకలను సిద్ధం చేస్తామని, ఇవి మరో 1.50 లక్షల ఎకరాలకు సరిపోతాయని వివరించారు.
ప్రాసెసింగ్ మిల్లులకు భూ కేటాయింపు
రాష్ట్రంలో పామాయిల్ ప్రాసెసింగ్ కోసం మిల్లుల ఏర్పాటుకు ఆయిల్ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూ సేకరణ పూర్తిచేసినట్టు మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలో ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ప్రీయూనిక్, మ్యాట్రిక్స్ కంపెనీలకు టీఎస్ఐఐసీ ద్వారా భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. మిగతా కంపెనీలకు కూడా భూమిని కేటాయించేందుకు దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పామాయిల్కు భారీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. కంపెనీలు గ్రామాలవారీగా అవగాహనా సమావేశాలు నిర్వహించి రైతులకు శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ఆయిల్పామ్ మొకల క్షేత్రాల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలో 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ మొకలు నాటి రికార్డు సృష్టించిన నేపథ్యంలో కేక్ కట్ చేసిన మంత్రి అధికారులు, కంపెనీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యానశాఖ నూతన సంవత్సర క్యాలెండర్ను కూడా మంత్రి విడుదల చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్, జేడీ సరోజిని, ఉద్యానశాఖ అధికారులు, ఆయిల్పామ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.