CM KCR | తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తంతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి చేతులమీదుగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను అందుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లోని తొమ్మిది విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేయగా.. ఎనిమిది విభాగాల్లో తెలంగాణ అవార్డులను సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయ్. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30శాతం రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా నాలుగు ఫస్ట్ ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయం’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో సోమవారం జరిగిన ‘పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సు – అవార్డుల ప్రదానోత్సవం’ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ అవార్డులను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం అభినందించారు.
పల్లె ప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్ఫూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధి కోసం కృషి కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.