హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (రెరా) చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో రెరా అనుమతుల కోసం వస్తున్న దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని, వాస్తవానికి 30 రోజుల గడువు ఉన్నప్పటికీ కేవలం 48 గంటల వ్యవధిలోనే ఏజెంట్లకు సర్టిఫికెట్లు జారీచేస్తున్నామని వివరించారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 220 మంది ఏజెంట్లకు మంగళవారం హైదరాబాద్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 3 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమని, కోనుగోలుదారులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత రియల్టర్ల పై ఉన్నదని స్పష్టం చేశారు. 500 చదరపు మీ టర్లు, 8 లేదా అంతకు మించిన అపార్ట్మెంట్ల నిర్మాణాలకు విధిగా రెరా రిజిస్ట్రేషన్ పొందాల ని తెలిపారు. కార్యక్రమంలో యూని క్ రియాలిటీ సంస్థ వ్యవస్థాపక సీఈ వో సుశీల్ కుమా ర్, కో-ఫౌండర్ వేణు కల్యాణ్ పాల్గొన్నారు.
రెరాలో నమోదైన బిల్డర్లు, ప్రమోటర్లు తమ ప్రాజెక్టులకు సంబంధించిన త్రైమాసిక, వార్షిక ఆడిట్ నివేదికలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని సత్యనారాయణ కోరారు. రెరా చట్టంలోని నిబంధనల మేరకు ఈ నివేదికలను ప్రమోటర్ లాగిన్ ద్వారా రెరా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. త్రైమాసిక నివేదికలను ఏటా ఏప్రిల్ 15, జూలై 15, అక్టోబర్ 15, జనవరి 15 లోగా.. వార్షిక ఆడిట్ నివేదికలను ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలల్లోగా సమర్పించాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటికే బిల్డర్లు, ప్రమోటర్లకు మెసేజ్లు, ఈ-మెయిళ్లు, నోటీసులు పంపామని, నివేదికలు సమర్పించని ప్రాజెక్టులపై రెరా నిబంధనల మేరకు చర్యలు చేపడతామని సత్యనారాయణ హెచ్చరించారు.