హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీం తో వారు సమ్మె విరమించారు. మంగళవారం సాయంత్రం రేషన్ దుకాణాలు తెరిచి, సరుకులు పంపిణీ చేశారు. సచివాలయంలో రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశమై గతంలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒకరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు.
ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని మంత్రి కోరారు. కమిషన్ పెంపు ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో తక్షణమే సమ్మె విరమించి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నామని రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయికోటి రాజు, ఇతర నేతలు మంత్రి సమక్షంలో ప్రకటించారు. మంత్రి హామీపై రేషన్ డీలర్ల జేఏసీ సం తోషం వ్యక్తం చేసింది. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, జాయింట్ కమిషనర్ ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు, రేషన్ డీలర్ల జేఏసీ కన్వీనర్ రవీందర్, కో-కన్వీనర్ మల్లికార్జున్గౌడ్, గౌరవాధ్యక్షుడు అనంతయ్య, హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ పుస్తె శ్రీకాంత్, రేషన్ డీలర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.