సిద్దిపేట: వైద్యారోగ్య పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో శనివారం ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్మన్ రోజాశర్మతోకలిసి పాల్గొన్నారు. డాక్టర్ అవతారమెత్తి ఆశా కార్యకర్తలకు మంత్రి హరీశ్రావు మార్గనిర్దేశం చేశారు. 27 వేల మంది ఆశ కార్యకర్తలు బలోపేతమైతే వైద్య శాఖ బాగుంటుందన్నారు. తెలంగాణ జ్వర సర్వే సూపర్ హిట్ అయిందని, కేంద్రసర్కారు మెచ్చుకుందని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంలో సఫలమయ్యామని హరీశ్రావు చెప్పారు.
జనం దవాఖానకు రాకుండా ఉంటేనే ఆనందమని, ప్రజారోగ్యం బాగుండాలన్నదే మన తపనగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షకులు ఆశావర్కర్లేనని, క్షేత్రస్థాయిలో పనితీరు బాగుండాలన్నారు. పనిచేసేవారికి తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. సిద్దిపేట జిల్లాకు చెందిన మంజుల అనే ఆశావర్కర్ను హైదరాబాద్లో సన్మానించామని గుర్తుచేశారు. మంచిగా పనిచేసే ఆశావర్కర్లను గుర్తించి, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి ఆరునెలకొకసారి సన్మానం చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో 5,500 హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయని, వాటిలో 202 బాగా లేవని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆయా హెల్త్ సెంటర్ల పరిధిలో 80 శాతం ప్రైవేట్ దవాఖానలో ప్రసవాలు జరుగుతున్నాయని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆ సెంటర్లలోని ఆశావర్కర్లు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లా బోధన్లో అమ్మ ఒడి సమస్యలు పరిష్కరించామని హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో 75శాతం గర్భిణులు ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకే రావాలని, అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరినట్లన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేట్ కంటే మెరుగైన వసతులున్నాయని, డాక్టర్ల పనితీరు బాగుందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే బాధ్యత తనదేనని హరీశ్రావు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులున్నాయని, రూ. 11వేల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామని తెలిపారు.
సీ సెక్షన్ ఆపరేషన్లు బాధాకరం..
రాష్ట్రంలో 62శాతం సిజేరియన్లు జరగడం బాధాకరమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పెద్ద దేశాల్లో 80 శాతం నార్మల్ డెలివరీలు అవుతున్నాయని చెప్పారు. కర్ణాటకలో 24 శాతం, మహారాష్ట్రలో 28శాతం సీ సెక్షన్ ఆపరేషన్లు జరుగుతుండగా..తెలంగాణలో 62శాతంగా ఉండడం విచారకరమన్నారు.
ఈ ఆపరేషన్లతో భవిష్యత్లో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశముందన్నారు. మొదటి గంటలో ముర్రు పాలు అమృతంతో సమానమని, ముర్రుపాలు అందక చిన్న పిల్లలు పుట్టిన పది రోజులపాటు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇవన్నీ ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వివరించాలని, ముర్రుపాల గురించి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
అందరూ అమ్మ ఒడి వాహనాలను వినియోగించుకునేలా చూడాలని, ప్రభుత్వ దవాఖానలో నార్మల్ డెలివరీలు పెగాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో విధులు సరిగా నిర్వర్తించని వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లులను కాపాడుకునేందుకు నిబద్ధతతో పనిచేద్దామని, సిద్దిపేటలో మార్పు జరిగితే రాష్ట్రం మొత్తం ఇదేవిధానాన్ని అమలుచేద్దామన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో వైద్య ఖర్చులు తగ్గించాలని, లేకుంటే లైసెన్స్ రద్దుచేస్తామని హెచ్చరికలు జారీచేశారు. త్వరలోనే దుబ్బాక, హుస్నాబాద్లో డయాలసిస్ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో రూపాయి ఖర్చు లేకుండా సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో రేడియో, కీమోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.