హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్లెలు మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్-ప్లస్) గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు గాను మూడు మినహా 12,766 పల్లెలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా జాబితాలో 99.98 శాతం తెలంగాణ గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపును పొందాయి. అయితే నిత్యం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ పాట పాడే బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేవు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలు కేవలం 4.54 శాతం మాత్రమే ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపు పొందాయి.
అక్కడ గత ఐదున్నర సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతున్నది. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్లో కేవలం 19.36శాతం గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపు పొందాయి. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం ద్వారా గ్రోత్ డబుల్ అవుతుందని, డబుల్ ఇంజిన్ గ్రోత్ కోసం బీజేపీకి ఓటు వేయాలని ఏ రాష్ట్ర ఎన్నికలు జరిగినా ఇదే నినాదాన్ని బీజేపీ నేతలు వినిపిస్తూ వస్తున్నారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ ఎన్నికల నినాదమే తప్ప వాస్తవంలో దాని డొల్లతనమెంతో పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల సంఖ్య ద్వారా మరోసారి డబుల్ ఇంజిన్ నినాదం ఢమాల్ అయ్యింది.
కేంద్రం సహకరించకపోయినా…
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఏ మాత్రం సహకరించుకున్నా రాష్ట్రంలోని పల్లెలు అనేక అంశాల్లో ముందు నిలుస్తున్నాయి. రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్రం జాప్యం చేసినా, నిబంధనల ప్రకారం రావాల్సిన నిధుల కంటే ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వకున్నా.. ఓడీఎఫ్ ప్లస్, ఆన్లైన్ అడిట్, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, ఈ- పంచాయత్, ఆదర్శ గ్రామాల అవార్డులను దక్కించుకున్నాయి. గతంలోనే అనేక అంశాల్లో తెలంగాణతో పోటీ పడలేని స్థితిలో ఉండగా.. మరోసారి ప్రగతి విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల పల్లెలు తెలంగాణను అందుకోలేక వెనుకబడ్డాయి.
పల్లెప్రగతి విజయపరంపరలో..
పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా అనేక అభివృద్ధి అంశాల్లో తెలంగాణ పల్లెలు విజయయాత్రను కొనసాగిస్తున్నాయి. వందలాది ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. పల్లెప్రగతి కింద ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను ప్రభుత్వం సమకూర్చింది. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా చేయడమే కాకుండావాటిని వినియోగించుకునే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకువచ్చింది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్ షెడ్ను నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 డంపింగ్ యార్డులను ప్రభుత్వం నిర్మించింది.
ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా ఇంటింటి చెత్తను సేకరిస్తున్నారు. ఘన వ్యర్థాలను విక్రయిస్తుండగా, తడి చెత్తను ఎరువుగా మారుస్తున్నారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగతంగా ఇంకుడు గుంతలను నిర్మించారు. దీంతో ఇంట్లో నుంచి వెలువడే వ్యర్థ జలాలు ఇంకుడు గుంతల్లోకి వెళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తలను వేయడానికి వీలుగా రెండు ప్లాస్టిక్ డబ్బాలను అందించారు. వీటన్నంటి ద్వారా తెలంగాణ పల్లెలు స్వచ్ఛతకు మారుపేరుగా మారాయి. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా జాతీయస్థాయిలో జెండా ఎగురేస్తున్నాయి.