హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస్ రావు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉండటంతో.. టెస్టు చేయించుకుంటే పాజిటివ్గా నిర్ధారణ అయిందని శ్రీనివాస్ రావు తెలిపారు. ముందు జాగ్రత్తగా తగిన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అపోహాలు వద్దు. త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సూచించారు.
హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా విసిరింది. ప్రతి పోలీసు స్టేషన్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్స్ కరోనా బారిన పడుతున్నారు. సీసీఎస్, సైబర్ క్రైమ్లో పని చేస్తున్న 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్కు వెళ్లి వచ్చింది. అందులో ఒక ఎస్ఐకి కరోనా సోకింది. ఆయన నుంచి మిగతా వారందరికీ కరోనా సోకినట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఇక హయత్నగర్ పోలీసు స్టేషన్లో ఎస్ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నార్సింగి పోలీసు స్టేషన్లోనూ 20 మందికి పాజిటివ్ వచ్చింది.