హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): నూతన ఆవిష్కరణల్లో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రాయదుర్గంలోని టీ హబ్లో బుధవారం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 490 కళాశాలల నుంచి వచ్చిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో పది ఉత్తమ ఆవిష్కరణలను నిపుణులు ఎం పిక చేశారు. వరంగల్ ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినుల బృందం రూపొందించిన రైతన్న కిట్కు మొదటి బహుమతి దక్కింది.
బీవీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్కు చెందిన విద్యార్థినుల బృందం బొగ్గు గనుల్లో కార్మికుల భద్రత కోసం రూపొందించిన బైట్ సిస్టమ్-సురక్షకు రెండో బహుమతి వచ్చింది. వరంగల్కు చెందిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థినులు రూపొందించిన క్రిమి సంహారిణి ఆలోచనకు మూడో బహుమతి దక్కింది. విప్ వినయ్ భాస్కర్, మాజీ సీఎస్ ఎస్కే జోషి, యూకే డిప్యూటీ హైకమిషనర్ గ్యారిత్ విన్ ఓవెన్, టీఎస్ఐసీ సీఐఈ డాక్టర్ శాంతా తౌటం విజేతలకు చెక్కులను అందజేశారు.