హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో దార్శనికత, ముందుచూపు ఉన్న నాయకత్వం ఉండటం వల్లే 8 ఏండ్లలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని జాతీయ రక్షణ కళాశాల (ఎన్డీసీ) ప్రతినిధి బృందం ప్రశంసించింది. దేశ అధ్యయన పర్యటనలో భాగంగా డిఫెన్స్ కాలేజీ ప్రతినిధులు గురువారం హైదరాబాద్ను సందర్శించారు. అనంతరం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సీఎస్ వారికి వివరించారు.
చిన్న రాష్ట్రం అయినప్పటికీ ప్రగతిలో దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, పట్టణ అభివృద్ధికి కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అనంతరం పలు అభివృద్ధి పథకాలపై అధికారులు జాతీయ రక్షణ కళాశాల బృందానికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా, ఆరోగ్య, వ్యవసాయ శాఖల కార్యదర్శులు రిజ్వీ, రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిఫెన్స్ కాలేజీ ప్రతినిధులు గవర్నర్ తమిళిసైను కలిసి పలు అంశాలపై చర్చించారు.