చిట్యాల: మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటుపట్ల ప్రజలు విసుగెత్తిపోతున్నారని, కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇవాళ (ఆదివారం) నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము ఏది చేసినా చెల్లుతుందని బీజేపీ అహంకారంతో వ్యవహరిస్తున్నదన్నారు.
తొమ్మిది రాష్ర్టాల్లో అనైతికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర మోదీది అని జగదీశ్రెడ్డి విమర్శించారు. ప్రజల తీర్పును లెక్క చేయకుండా అప్రజాస్వామిక పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. దీంతో విసుగెత్తిన కన్నడ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, తిరుగుబాటు ఎట్లా ఉంటుందో మోదీకి రుచి చూపించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు యావత్ భారతావని సన్నద్ధం అవుతుందని చెప్పారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు స్థితిలో ఉన్నదని, ప్రజలు అధికారం అప్పగించినా నిలబెట్టుకునే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు.
మోదీపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం సన్నగిల్లుతున్నదని, హామీలను అమలు చేయకపోతే ఏమవుతుందో కన్నడ ప్రజలు చూపించారని అన్నారు. ఇది దేశానికి మంచి పరిణామమని, అందరూ స్వాగతించాలని మంత్రి పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, నాయకులు పాల్గొన్నారు.